భూ భారతికి 3,976 అప్లికేషన్లు.. పరిష్కారం దిశగా అధికారుల కసరత్తు

by Sumithra |
భూ భారతికి 3,976 అప్లికేషన్లు.. పరిష్కారం దిశగా అధికారుల కసరత్తు
X

దిశ, ములుగు ప్రతినిధి : ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్​ను రద్దు చేసి భూ సమస్యలను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలుగు మండలాలను ఎంపిక చేసింది. ఈ నాలుగు మండలాల్లో ఒకటైన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రైతులు సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. భూ భారతి సంబంధించి వెంకటాపూర్ మండలంలో భూ సమస్యల పరిష్కారానికి 9 రెవెన్యూ గ్రామాల నుండి 3,976 అప్లికేషన్లు అధికారులకు అందాయి. మొత్తం అప్లికేషన్లను పరిశీలించిన అధికారులు ఇప్పటికే సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించి దశలవారీగా సమస్యలను పరిష్కరించనున్నారు.

వెంకటాపూర్ మండలంలో 3,976 అప్లికేషన్లు..

వెంకటాపూర్ మండలంలో మొత్తం 9 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ నెల 17న భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభమై 23వ తేదీన పూర్తయ్యాయి. ఈ రెవెన్యూ సదస్సులో నర్సాపూర్ గ్రామంలో 740, వెంకటాపూర్ గ్రామంలో 1295, రామంతపూర్ గ్రామంలో 429, నల్లగుంట గ్రామంలో 345, తిమ్మాపూర్ గ్రామంలో 48, అడవి రంగాపూర్ గ్రామంలో 50, రామంతపల్లి గ్రామంలో 25, లక్ష్మీదేవి పేట గ్రామంలో 977 చొప్పున వెంకటాపూర్ మండలంలో మొత్తం 3,976 అప్లికేషన్లు రెవెన్యూ అధికారులు స్వీకరించారు. వెంకటాపూర్ మండలంలో నిర్వహించిన భూ భారతి సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లలో ఎక్కువ 1,647 మంది రైతులు కొత్త పాస్ పుస్తకాల కోసం, 1,240 దరఖాస్తులు సాదా బైనామా కింద భూ క్రమబద్ధీకరణ కోసం, 327 అసైన్డ్ భూమి సమస్యలు తీర్చాలని, 243 భూమి విస్తీర్ణం సరి చేసేందుకు,188 మంది వివరాలను సరి చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తుల పరిష్కారం దిశగా అడుగులు..

మండల వ్యాప్తంగా దరఖాస్తులను పరిష్కారం చూపే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. వచ్చిన అప్లికేషన్లను రెవెన్యూ అధికారులు పరిశీలించి దరఖాస్తులను సమస్యల వారీగా విభజించి పరిశీలిచ్చేందుకు 9 రెవెన్యూ గ్రామాల్లో 9 బృందాలుగా ఏర్పడ్డారు. ఈనెల 26 నుంచి ఆయా గ్రామాల్లో రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో అప్లికేషన్లు పరిశీలన ప్రారంభించారు. పరిశీలన పూర్తయిన అనంతరం నివేదికను ఉన్నతాధికారుల సమక్షంలో దరఖాస్తుదారుల సమస్యకు పరిష్కారం చూపనున్నారు.

జూన్ 1లోపు భూ సమస్యలకు పరిష్కారం.. వెంకటాపూర్ ఎమ్మార్వో గిరిబాబు

వెంకటాపూర్ మండలంలో భూ భారతి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్న క్రమంలో మండల వ్యాప్తంగా 3,976 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దరఖాస్తుల పరిశీలన కొరకు ఇప్పటికే ఫీల్డ్ విజిట్ జరుగుతుంది. ఫీల్డ్ విజిట్ పూర్తయిన అనంతరం కలెక్టర్, ఆర్డీవోల పర్యవేక్షణలో జూన్ 1 లోపు వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తాం.



Next Story

Most Viewed