గవర్నర్ తమిళిసై పై బాడీ షేమింగ్.. అసభ్య పదజాలంతో ట్రోల్స్

by Disha Web Desk 4 |
గవర్నర్ తమిళిసై పై బాడీ షేమింగ్..  అసభ్య పదజాలంతో ట్రోల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసిన పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు సంధించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. గవర్నర్ పై అదే సామాజిక మాధ్యమాల్లో ముప్పేట దాడి జరుగుతున్నా ప్రేక్షకపాత్ర వహిస్తుండటం గమనార్హం. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగింది. ప్రొటోకాల్ పాటించకపోవడం, అగౌరవపర్చడం తదితర అంశాలు చర్చకు దారి తీశాయి. ఢిల్లీలో పీఎం, కేంద్ర హోం మంత్రిని కలిసి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను వివరించిన ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పెరిగిపోయాయి. సీఎం కేసీఆర్​ ఫొటోలను డీపీలుగా పెట్టుకుంటూ ఫేస్​బుక్​, వాట్సాప్​, ట్విట్టర్లలో గవర్నర్​పై ముప్పేట దాడికి దిగుతున్నారు. విమర్శల దాడి కూడా హద్దు మీరుతున్నది. అసభ్యపదజాలాన్ని వాడడం గమనార్హం. శూర్పణఖ, అరవ సంత అంటూ నానా రకాలుగా పోస్టింగ్ లు చేస్తున్నారు. బాడీ షేమింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ సోషల్​ మీడియా ఈ విషయంలో హద్దు మీరుతున్నది. సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఈ విమర్శలు లైన్​ దాటుతున్నాయి. పక్క రాష్ట్రానికి చెందిన ఒక బీసీ మహిళ.. అది కూడా రాష్ట్ర ప్రథమ మహిళపై చేస్తున్న పోస్టులు సభ్యసమాజం తలదించుకొనేలా ఉంటున్నాయి.

పోలీస్ సార్లూ.. చూస్తున్నారా!

సోషల్ మీడియాలో హద్దు మీరితో ఊరుకోం.. ఖబడ్దార్​..! అంటూ ప్రకటనలు చేసిన పోలీసులు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్​ అయ్యారు. ప్రభుత్వాన్ని చిన్న మాట అన్నా తట్టుకోలేని ఖాకీలు.. గవర్నర్​పై చేస్తున్న ఘాటు విమర్శలను చూస్తూ ప్రేక్షకుల్లా ఉండిపోయారు. సుమోటో కేసులు నమోదు చేయడం ఇప్పుడు మరిచిపోయారు. రాష్ట్ర పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులకు మాత్రమే పరిమితమవున్నారు. సైబర్​ క్రైం దృష్టికి అసలే వెళ్లడం లేదు. గవర్నర్​ పైనా, విపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అడ్డగోలు పోస్టులు పెట్టినా వాటిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఇటీవల టీఆర్​ఎస్​ పార్టీ ఫేస్‌బుక్ పేజీల్లో విపరీతంగా వైరల్ అవుతున్న పోస్టు వివాదాలకు మరింత ఆజ్యం పోస్తున్నది. కొందరు.. గవర్నర్‌ ఫొటోకు పొడవాటి ఎర్ర తిలకం దిద్ది ఫేస్ బుక్ లో పోస్ట్‌ చేశారు... 'మీ కోసమే ఈ ఫొటో.. బయట తగిలియ్యండి. అంతా మంచిగుంటది' అంటూ కామెంట్‌ పెట్టాడు. 'మా ఉగాదిలో నీ గెలుకుడేందో?' అంటూ నాలుక బయటపెట్టి లైట్‌ తీసుకుంటున్నట్లున్న ఎమోజీని మరో వ్యక్తి పోస్ట్‌ చేశాడు. రహస్య ఖాతాల్లో నుంచి కాకుండా.. నేరుగా తమ వివరాలు పూర్తిగా ఉన్న అకౌంట్ల నుంచి ఈ పోస్టులు వస్తున్నాయి. టీఆర్ఎస్ అనుకూల వర్గాలే రెచ్చిపోతున్నాయని కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా.. నో కేసు.. నో సుమోటో..!

కేటీఆర్​ ఆజ్యం​

ఇక గవర్నర్​, టీఆర్​ఎస్​ వివాదాల్లో మంత్రి కేటీఆర్​ సైలెంట్​గానే ఆరోపణలకు అవకాశం ఇస్తున్నారు. గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయితీ లేదంటూ ముందుగా చెప్పుకొచ్చారు. ఊహించుకొని గవర్నర్ మాట్లాడితే మేం ఏం చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్న సమయంలో తమకు ఏనాడూ ఇబ్బంది కలుగలేదని గుర్తు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో తమను ఇబ్బంది పెట్టినందుకు గాను ఆమెను మేం ఇబ్బంది పెడుతున్నామని గవర్నర్ అనడం సరైంది కాదంటూనే.. గవర్నర్ కాక ముందు తమిళిసై ఏ పార్టీ నాయకురాలో అందరికీ తెలుసంటూ కేటీఆర్​ సెటైర్​ వేశారు. "పొలిటికల్ లీడర్ గా వున్న మీరు గవర్నర్ కావచ్చే కానీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావొద్దా? అని కేటీఆర్ వ్యాఖ్యానించడం టీఆర్​ఎస్​ సోషల్​ మీడియా వింగ్ జోరును మరింతగా పెంచింది.

ఇవేం ట్రోల్స్​ అంటున్న గవర్నర్​

రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తనను ఇష్టారాజ్యంగా విమర్శించారని గవర్నర్​ సైతం ఇటీవల ఆరోపించారు. తనను పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవే తన లక్ష్యమని, ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతోందని, తెలంగాణలో తాను రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని తమిళిసై కామెంట్ చేశారు. గవర్నర్‌గా తనకు అర్హతులున్నందునే అవకాశం ఇచ్చారని తమిళ సై సమాధానమిచ్చారు.

ఇంత అవమానకరమా : దాసోజు శ్రవణ్​

గౌరవనీయ పోస్టులో ఉన్న వ్యక్తిని అవమానిస్తున్నారు. గవర్నర్‌ బీసీ మహిళ అయినందునే ఇంత నిర్దాక్షిణ్యంగా ట్రోల్‌ చేస్తున్నారు. రాజ్యాంగ ప్రతినిధి, రాష్ట్ర ప్రథమ పౌరురాలి పట్ల అవమానకర ట్రోలింగ్స్‌పై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గవర్నర్‌ను దుర్భాషలాడే సంస్కృతి తెలంగాణకు ఎప్పుడొచ్చింది. మహిళా గవర్నర్‌ను అవమానపరుస్తూ మహిళా దినోత్సవాలు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ చెప్పుకుంటున్నారు. సోషల్​ మీడియాలో యాక్టివ్​ గా ఉండే మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు. ట్రోల్స్‌ పెడుతుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం వచ్చేసింది అనుకుంటున్నారు. అందుకే ఒక మంత్రి గవర్నర్​వ్యవస్థనే అవసరం లేదని అంటున్నారు. గవర్నర్​పై టీఆర్ఎస్​మంత్రులు అవాకులు చవాకులు పేలడం చూస్తుంటే ఛీ వీళ్లా మా మంత్రులు అనిపిస్తోంది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర ప్రథమ పౌరురాలిపై పిచ్చి రాతలతో ట్రోల్​చేస్తున్న వారిపై కేసులుపెట్టాలి. నక్కకు చావు దగ్గరికి వస్తే నగరం వైపు పరిగెత్తిందంట. అలాగే టీఆర్ఎస్​అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. కాబట్టే ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్నారు.

= సంగప్ప, బీజేపీ అధికార ప్రతినిధి



Next Story

Most Viewed