MLC బరిలో తీన్మార్ మల్లన్న..? కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్!

by Disha Web Desk 4 |
MLC బరిలో తీన్మార్ మల్లన్న..? కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందిన చింతపండు నవీన్ మరోసారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారిక అభ్యర్థిగా ఖరారు కానున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఇప్పటి నుంచే వర్క్ చేసుకోవాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు. మూడేండ్ల క్రితం 2021 మార్చిలో జరిగిన నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 1.49 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేవలం 12,806 ఓట్ల ఆధిక్యంతో తీన్మార్ మల్లన్నపై గెలిచారు.

గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా ఈసారి మాత్రం కాంగ్రెస్ టికెట్‌తో పోటీచేస్తారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తొలుత ఇదే నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ తరపున పోటీచేయగా కేవలం 13,033 ఓట్లకే పరిమితమయ్యారు. ఆరేండ్ల వ్యవధిలో ఆయన పట్టభద్రుల్లో తన పాపులారిటీని, బలాన్ని పెంచుకుని 1.49 లక్షల ఓట్లు పొందగలిగారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ లోక్‌సభ స్థానంలో గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ కారణంగా హుజూర్‌నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపొందలేకపోయారు.

బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలు, నిరుద్యోగ పట్టభద్రులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకుని సొంతంగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానెల్ ద్వారా రాష్ట్రంలోని వివిధ సెక్షన్ల ప్రజల్లో పాపులర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. చివరకు ఆ పాపులారిటీయే గ్రాడ్యుయేట్ల విశ్వసాన్ని చూరగొనడానికి కారణమైంది. పట్టభద్రతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 13 వేల ఓట్లకు మాత్రమే పరిమితమైన తీన్మార్ మల్లన్న 2021లో జరిగిన ఎన్నికల నాటికి 1.49 లక్షల ఓట్లు పొందగలిగారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు ఈ మూడు జిల్లా (వరంగల్, నల్లగొండ, ఖమ్మం)ల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నది.

ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఈ మూడు జిల్లాలతో కూడిన నియోజకవర్గంలో పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది ఆయన సన్నిహితుల అభిప్రాయం. నవంబరు చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకుని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడే కలిసి ముచ్చటించారు. ఇంతకాలం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న బరిలో ఉంటారని ఆయన అనుచరులు, సన్నిహితులు పేర్కొన్నారు.




Next Story

Most Viewed