సీనియారిటీ జాబితా సమగ్రంగా రూపొందించాలి.. టీఎస్‌ యూటీఎఫ్ డిమాండ్

by Dishafeatures2 |
సీనియారిటీ జాబితా సమగ్రంగా రూపొందించాలి.. టీఎస్‌ యూటీఎఫ్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదోన్నతులకు అర్హతగలిగిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఒకే రకంగా సమగ్రంగా రూపొందించాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీసు బేరర్స్ సమావేశం ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో కె జంగయ్య అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయిన వెటనే అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని తద్వారా వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని కోరారు. పండితులు, వ్యాయమ ఉపాధ్యాయులకు అందరితోపాటే పదోన్నతులు ఇవ్వాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 5571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 317 ద్వారా పొరుగు జిల్లాలకు కెటాయించిన టీచర్లను పదోన్నతుల అనంతరం ఏర్పడిన ఖాళీల్లో స్వంత జిల్లాలకు తీసుకురావాలని, మిగిలి పోయిన 13 జిల్లాల దంపతుల బదిలీలు పూర్తి చేయాలని సూచించారు.

ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో పైరవీ బదిలీల ద్వారా సబ్జక్టేతర ఖాళీ (అగైనెస్ట్ వేకన్సీ) లో నియమించబడిన ఉపాధ్యాయుల పోస్టులను ఆయా సబ్జక్టుల పదోన్నతులకు ఖాళీలుగా చూపాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, కేజీబీవీ బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి పాపన్న, మాణిక్ రెడ్డి గెలుపు కోసం అన్ని జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ రాములు, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె సోమశేఖర్, ఎం రాజశేఖర్ రెడ్డి, జి నాగమణి, ఇ గాలయ్య, బి రాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed