సొమ్ము ప్రజలది.. సోకొకడిది.. వ్యాపారంగా మారిన చిన్న మేడారం జాతర

by Shiva |   ( Updated:2024-02-15 03:54:44.0  )
సొమ్ము ప్రజలది.. సోకొకడిది.. వ్యాపారంగా మారిన చిన్న మేడారం జాతర
X

దిశ, రాజాపేట: రాజాపేట మండలంలోని కుర్రారం చిన్న మేడారంలో ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క, సారలమ్మ జాతరలో సామాన్య భక్తులకు నిర్వాహకులు కుచ్చుటోపి పెడుతున్నారు. 30 ఏళ్ల నుంచి రెండేళ్లకు ఒకసారి జాతర నిర్వహిస్తుండడంతో లక్షల మంది దర్శనానికి వస్తారు. ప్రజల సొమ్ము ప్రైవేటు వ్యక్తులకు ఆదాయంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు పిలిచి రూ.లక్షలు సొమ్ము చేసుకుని, తల్లుల దర్శనానికి వచ్చే భక్తుల జేబులు గుల్ల చేస్తున్నారు. గతంలో టెండర్ల నిర్వాహకులతో భక్తుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

టెండర్లు ఇలా..

జాతరకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు దర్శనానికి వచ్చే భక్తులకు రూ.20 నుంచి రూ.50లుగా నిర్ణయించారు. కొబ్బరిచిప్పల నిర్వహణకు రూ. 65 వేలు, లడ్డు, పులిహోర అమ్మకం కోసం రూ.62 వేలు, మటన్, చికెన్ షాప్ నిర్వాహకులకు రూ.90 వేలు, పేలాలు అమ్ముకోవడానికి రూ.32 వేలు, ఇక మద్యం, బెల్లం టెండర్లలు లోలోపలే జరిగిపోయాయి.

ఏరులై పారనున్న మద్యం.. అంతా సిండికేటే

జాతర అంటేనే మద్యానికి పెద్దపీట. ఎంఆర్‌పీ రేటుపై ఎంతైనా అమ్ముకోవచ్చని నిర్వాహకులు గుత్తేదారులకు తెలిపారు. ఇలా అనేక అక్రమాల ద్వారా నిర్వాహకులు లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ టెండర్ల మాయాజాలంపై అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిర్వాహకులు అధికారులు కుమ్మక్కైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మండలంలో జరిగే చల్లూరు, లక్ష్మక్కపల్లి జాతరలో నిర్వాహకులు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించే చిన్న మేడారం జాతరలో నిర్వాహకులు భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సామాన్య భక్తులు ఉచిత దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

పంచాయతీలకు లేని ఆదాయం..

బూరుగుపల్లి, కుర్రారం గ్రామాల మధ్యన చిన్న మేడారం జాతర 30 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. 2 గ్రామ పంచాయతీల బ్లీచింగ్ పౌడర్, లైట్లు, సిబ్బందిని ప్రజలను జాతర సమయంలో సేవల కోసం వినియోగించుకుంటున్నారు. హుండీ ఆదాయం, టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం రెండు గ్రామ పంచాయతీలకు చిల్లిగవ్వ ఇవ్వకుండా నిర్వాహకులు మాత్రమే పంచుకుంటున్నారు.



Next Story