అర్ధరాత్రి కుక్కలపై రెచ్చిపోయిన దుండగులు.. గన్‌తో కాల్పులు

by Disha Web Desk 2 |
అర్ధరాత్రి కుక్కలపై రెచ్చిపోయిన దుండగులు.. గన్‌తో కాల్పులు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/అడ్డాకుల: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత మాస్కులు ధరించిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చి గన్‌తో కుక్కలపై కాల్పులు జరిపారు. రోడ్లపై ఉన్న కుక్కలను కాలుస్తూ గ్రామంలో రోడ్ల వెంబడి తిరిగారు. కుక్కల అరుపులు, గన్ శబ్దాలకు భయపడిన జనం ఇండ్ల నుండి బయటకు రాలేదు. బుల్లెట్ దెబ్బలు తగిలిన కుక్కలు కొన్ని అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొన్ని గాయాలతో పరుగులు తీస్తూ పలు వీధులలో ప్రాణాలు వదిలాయి.

మొత్తం 20కి పైగా కుక్కలు ప్రాణాలు కోల్పోగా.. మరికొన్ని గాయాలపాలు అయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న భూత్పూర్ సీఐ రామకృష్ణ, అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు, వెటర్నరీ వైద్యులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత్యువాత పడ్డ కుక్కల మృతదేహాలలో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కాల్పులు జరిపిన దుండగులు ఎవరు..? ఎందుకోసం చంపారు.. అనే సందేహాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Next Story

Most Viewed