తెలంగాణలో భారీగా విద్యుత్ వినియోగం.. యాసంగి అంచనాలివే..!

by srinivas |
తెలంగాణలో భారీగా విద్యుత్ వినియోగం.. యాసంగి అంచనాలివే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈ యాసంగికి వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అన్నదాతలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వడం ఒకటైతే.. మరో వైపు రైతులు భారీగా విద్యుత్‌ను వినియోగిస్తుండటంతో కరెంటు వాడకం ఒక్క సారిగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 29 లక్షలకు పైనే వ్యవసాయ కరెంటు కనెక్షన్లు ఉండగా, ఈ ఏడాది వానాకాలంలో వర్షాలు పడి చెరువులు, బావులు, బోర్లలో నీరు ఉండటంతో ఈ యాసంగి పంటల సాగు మరింతగా పుంజుకుంటోంది. ఈ సీజన్‌లో వాడే పంపుసెట్లలో 10 హెచ్పీ‌కి పైన ఉన్నవే అధికంగా ఉన్నాయి.

యాసంగిలో విద్యుత్ లోడ్ ఎక్కువే..

అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 10 హెచ్పీ మోటర్లు కోటి 60 లక్షల 700 ఉంటే, 10 హెచ్పీ‌పైన ఉన్నవి 92 వేల, 160 వరకు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఎక్కువ వ్యవసాయ విద్యుత్‌ లోడ్ ఉండే వీలు ఉందని విద్యుత్ శాఖ ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ఖరీఫ్‌లో సగటున రోజుకు ఒక్కో పంపు సెట్ 2.20 హెచ్పీలు ఉంటే, అదే యాసంగిలో 4.30 హెచ్పీలు ఉంటుందని, అన్‌సీజన్(ఏప్రిల్‌‌‌‌‌‌-మే)లో 1.80 హెచ్పీలు ఉంటోందని ఆఫీసర్లు తెలిపారు. కాగా, అటు జెన్‌‌కో విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు సరఫరాలో తరుచూ వస్తున్న సమస్యల వల్ల 105 ఎంయూల వరకు రావాల్సిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రోజుకు 75 ఎంయూలకే పరిమితం అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు అన్‌సీజన్ కావడంతో పవన విద్యుత్‌ కుడా విద్యుత్‌ శాఖకు సరిపడా అందడం లేదంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర విద్యుత్, ప్రైవేటు విద్యుత్ కలుపుకొన్నా డిమాండ్‌ను చేరుకోవడానికి ఇంకా 35 నుంచి 40 ఎంయూల వరకు మార్కెట్‌లో కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయని సమాచారం.

వరి సాగు గతేడాది కంటే 5 లక్షల ఎకరాలు ఎక్కువ

రాష్ట్రంలో ఈ యాసంగిలో ఇప్పటికే దాదాపు 40 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోందని అధికారులు అంచనా వేశారు. గతేడాది కంటే కూడా ఈ ఏడాది 5 లక్షల ఎకరాలు ఎక్కువగానే సాగైంది. ఇందుకు ప్రధాన కారణం భూగర్భ జలాలు పెరడమేనంటున్నారు. ఈ భూగర్భ జలాలు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 29 లక్షల వరకు బోర్లు నడుస్తున్నాయని, ఇవి కాలువల ద్వారా వచ్చే నీటి కంటే కూడా ఈ బోర్లు అత్యధికంగా నీటిని పంపింగ్‌ చేస్తుండటంతో కరెంటు డిమాండ్ రోజురోజుకూ కూడా పెరుగుతోందని విద్యుత్‌ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని, ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు ఎలాంటి లోటు రాకుండా నిరంతరం సమీక్ష సమావేశాలను పెట్టిస్తోంది. ఉచిత విద్యుత్ ద్వారా పంట దిగుబడి పెంచేలా, అన్నదాతలకు అధునాతమైన యంత్ర పరికరాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఈ యాసంగి పంట కాలం నుంచే రైతులకు 50 శాతం రాయితీపై వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అటు పంటలకు, ఇటు బోర్ల వినియోగానికి వివిధ రకాలుగా విద్యుత్ వాడకం భారీగా పెంచుకుంటూ వెళుతుండడంతో ఈ జనవరి నెలలోనే విద్యుత్‌ వాడకం గణనీయంగా నమోదవుతోందని డిస్కం అధికారులు తెలిపారు. చలి నేపథ్యంలో అత్యధిక ఉష్ఞోగ్రతలు నమోదు అవుతున్నప్పటికీ ఈ సారి యాసంగిలో వరి సాగు పెరగడంతో రాష్ట్రంలో కరెంటు వాడకం కూడా అదే స్థాయిలో పెరిగిందని అధికారులు వెల్లడించారు. మరో రెండు నెలల్లో మార్చి‌లోనే 15 వేల మెగావాట్లు విద్యుత్ డిమాండ్ దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed