'బండి' సడెన్ హస్తిన టూర్ మతలబేంటి.. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా..?

by Disha Web Desk 19 |
బండి సడెన్ హస్తిన టూర్ మతలబేంటి.. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్టుండి హుటాహుటిన సోమవారం రాత్రి హస్తినాకు వెళ్లారు. సైలెంట్‌గా వెళ్లి రావడం వెనుక బీజేపీలో ఏదో జరగబోతోందని సంకేతాలు వస్తున్నాయి. అసలు బండి సంజయ్ హస్తిన టూర్ వెనుక మతలబేంటనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉండగా సంజయ్ ఢిల్లీ టూర్ అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీ టూర్ తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఫిక్స్ అయింది. ఈనెల 28వ తేదీన ఆయన తెలంగాణకు విచ్చేయనున్నారు. ఉన్న పళంగా వ్యూహాలు మార్చుకోవడం వెనుక ఏదో సంచలనం జరగబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి ఆ సెన్షేషన్ ఏంటనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఎవరి ఊహకందడంలేదు.

ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో తెలంగాణపై ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై చర్చ సాగుతోంది. దక్షిణాదిపై గురి పెట్టిన కాషాయదళం.. వచ్చే ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సెషన్ సాగనున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన నేతలకు ఇప్పటికే బీజేపీ హైకమాండ్ పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గంలో అదనంగా ఇంకా ఎవరికైనా అవకాశం కల్పిస్తారా ? రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు చోటుచేసుకుంటాయా ? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

సికింద్రాబాద్​– విజయవాడ మధ్య వందేభారత్​ఎక్స్ ప్రెస్​రైలు ప్రారంభానికి ఈ నెల 19న రావాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సడెన్‌గా వాయిదా పడింది. బీజేపీ శ్రేణులు పరేడ్​ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభకు ప్రిపేర్​కూడా అయ్యారు. మోడీ పర్యటన ఎందుకోసం వాయిదా పడిందనే దానిపై రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రధాని టూర్ మాత్రం వాయిదా పడిందన్న సమాచారంతో తిరుగుపయనమయ్యారు. సికింద్రాబాద్​‌‌–విజయవాడ వందేభారత్​ఎక్స్ ప్రెస్​రైలును విశాఖ వరకు ఎక్స్​టెండ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఒకేసారి వైజాగ్ వరకు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు. ఎన్నికల సంసిద్ధతపై దిశానిర్దేశంతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై వివిధ స్థాయి నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా సంఘ్ కార్యకర్తలతోనూ ఆయన భేటీ నిర్వహించనున్నట్లు టాక్. అయితే వీటన్నింటితో పాటు ఆయన ఖమ్మం జిల్లాలోనూ పర్యటించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఈనెల 18వ తేదీన అమిత్ షాతో భేటీ ఆయన అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించి జాయిన్ అవుతారని రాజకీయవర్గాల్లో టాక్. కాగా అమిత్ షా ఖమ్మం పర్యటనలోనే ఆయన కాషాయతీర్థం పుచ్చుకుంటారా? అనే కొత్త చర్చ నేతల్లో మొదలైంది.

కేంద్ర క్యాబినెట్​ విస్తరణ త్వరలోనే జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఎంపీలకు ఛాన్స్​దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ లక్ష్మణ్​ఇప్పటికే పార్టీ పార్లమెంట్​బోర్డ్ మెంబర్‌గా ఉన్నారు. కరీంనగర్​ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ.. ఇటీవల బండి సంజయ్​ఢిల్లీ వెళ్లిరావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రి వర్గంలో ఛాన్స్​కోసమే ఢిల్లీ పిలుపు వచ్చిందా? మోడీ పర్యటన ఏర్పాట్లపై ఢిల్లీ పిలిచారా ? పార్టీ పని మీద హస్తిన పర్యటించారా ? అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఆదిలాబాద్​ఎంపీ సోయంబాపు, నిజామాబాద్​ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా మోడీ కేబినెట్‌లో బెర్త్ కోసం ఎదురుచూస్తున్నారు. మోడీ కేబినెట్​విస్తరణపై తెలంగాణ నేతలు మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కనుందోననేది ఉత్కంఠగా మారింది. అధికార బీఆర్ఎస్‌కు అంతుచిక్కకుండా బీజేపీ నేతలు కొత్త వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. మరి ఆ వ్యూహాలు సక్సెస్ అవుతాయా? బెడిసికొడతాయా? అనేది వేచిచూడాల్సిందే.



Next Story