ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం

by Disha Web Desk 2 |
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే గ్రామస్థాయిలోని వార్డుల నుంచి అభ్యర్థులను ప్రకటిస్తామని, పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేతలకు పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నియామకం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. పార్టీని గ్రామస్థాయిలో పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సభ్యత్వ నమోదులో సమస్యలను అధిగమించడానికి 300మంది సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇస్తున్నామని, ప్రతి పార్లమెంట్‌కు 14 మంది సభ్యత్వ నమోదు నిపుణులను పంపున్నట్లు తెలిపారు. పనిచేసే వ్యక్తులకే పార్టీ బాధ్యతలతో పాటు టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. గ్రామగ్రామాన పార్టీ జెండా రెపరెపలాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అజ్మీరా రాజునాయక్, మోపతయ్య, బాలకిషోర్ యాదవ్, వినయ్ మిత్రయాదవ్, షేక్ ఆరీఫ్, నెల్లూరి దుర్గాప్రసాద్, బాలసుబ్రమణ్యం, మల్కాజ్ గిరి పార్లమెంట్ అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read more:

ఎన్టీఆరే కారణమంటూ మరోసారి తుమ్మల సంచలన వ్యాఖ్యలు...అధిష్టానానికి వ్యతిరేకంగా పాలేరు TDP శ్రేణుల కీలక తీర్మాణం


Next Story