బీజేపీకి లాభం చేకూర్చడానికే MIM థర్డ్ ఫ్రంట్ ప్రకటన: తమ్మినేని వీరభద్రం ఫైర్

by Disha Web Desk 19 |
బీజేపీకి లాభం చేకూర్చడానికే MIM థర్డ్ ఫ్రంట్ ప్రకటన: తమ్మినేని వీరభద్రం ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో మూడో ఫ్రంట్‌ను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కలసి ఏర్పాటు చేస్తామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించడం మతోన్మాద బీజేపీకి ఉపయోగపడేలా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ ఫ్రంట్ వల్ల మత ప్రాతిపదిక రాజకీయాలకు మేలు చేసి, దేశ సమైక్యత, సమగ్రతకు నష్టం కల్గిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని రెండు ఫ్రంట్‌లకు సమదూరం పాటిస్తామని బీఆర్‌ఎస్‌ ప్రకటించడం కూడా బీజేపీకి దోహదపడే విధంగానే అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకునే ధోరణి, వైఖరిని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తోందన్నారు.

గతంలో జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి లాభించే విధంగా ఎంఐఎం పోటీ చేసి.. కాషాయ పార్టీ వ్యతిరేక ఓట్లు చీల్చి ఆ పార్టీకి లాభం చేకూర్చిందన్నారు. దీని ఫలితంగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాలలో సెక్యూలర్‌ ఓట్లును చీల్చిందని ఆయన గుర్తు చేశారు. ఇపుడు కూడా థర్డ్‌ ఫ్రంట్‌ అనే ప్రకటన అందులో భాగమేనని అన్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఎంఐఎం వైఖరి ఇదే విధంగా ఉందని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ మతోన్మాద ప్రమాదాన్ని ఎదుర్కోడానికి సెక్యూలర్‌ శక్తులు ఒక్కటై ఎన్డీఏ కూటమిని ఎదుర్కొంటుంటే బీఆర్ఎస్, ఎంఐఎంలు తలపెట్టిన థర్డ్‌ ఫ్రంట్‌ వల్ల ఎవరికి లాభమని ఆయన ప్రశ్నించారు.

యూనిఫాం సివిల్‌ కోడ్‌, ఎన్నార్సీ వంటి చట్టాలు తెచ్చి దేశంలోని మైనార్టీల హక్కులు కాలరాయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే.. ఆ పార్టీకి మేలు జరిగే విధంగా ఎంఐఎం వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. అదే సందర్భంలో బీజేపీ వ్యవహరిస్తున్న పద్థతిలోనే ఎంఐఎం వ్యవహారశైలి మత రాజకీయాలు బలపడే విధంగా వుండటం దేశానికి హాని కల్గిస్తుందన్నారు. దీనివల్ల మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రోత్సహించే బీజేపీకి వత్తాసు పలికే విధంగా ఎంఐఎం వ్యవహరించడం మానుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.


Next Story

Most Viewed