CM కేసీఆర్‌కు T-BJP చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ..

by Disha Web Desk 19 |
CM కేసీఆర్‌కు T-BJP చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: పీఎర్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ లేఖ బహిరంగ లేఖ రాశారు. తక్షణమే వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1 నుంచి జీతాలు చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం నాడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేస్తే ఆనాటి ప్రభుత్వం దిగొచ్చిందని సంజయ్ తెలిపారు.

పార్లమెంటులో బీజేపీ మద్దతుతో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది స్వరాష్ట్రం ఏర్పాటైందని వివరించారు. కానీ, స్వరాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాల్సిన మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వారిని అడుగడుగునా మోసం చేస్తున్నారని కేసీఆర్‌పై బండి మండిపడ్డారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు తీసుకోవడం ఉద్యోగుల హక్కు అని.. కానీ, సక్రమంగా జీతాలు చెల్లించకుండా వారి హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవో అమలు పేరుతో ఉద్యోగుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. పీఆర్సీ అమలు విషయంలోనూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఆర్ బిశ్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పీఆర్సీ నివేదికను 2018 జులై 1 నుంచి అమలు చేయాల్సి ఉన్నా, 21 నెలలు అమలు చేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇబ్బందిపెట్టారని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఏడాది జూన్ 30తో మొదటి పీఆర్సీ గడువు ముగుస్తుంది. ఈ ఏడాది జులై 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలని. కానీ ఇంతవరకు పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం అన్యాయం అని బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

పీఆర్సీ నివేదిక లేకుండా పీఆర్సీ ఎట్లా అమలు చేస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీ వైఖరి చూస్తుంటే ఏదో రకంగా కాలయాపన చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఎగ్గొట్టాలనే ధోరణి కనిపిస్తోందని ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని తక్షణమే కొత్త పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా, మూడు నెలల గడువు విధించి నివేదిక తెప్పించుకుని, ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని బండి సంజయ్ లేఖలో స్పష్టం చేశారు.


Next Story

Most Viewed