అన్ని పార్టీల్లో గెలుపు ధీమా... అయినా లోలోపల ఆందోళన

by S Gopi |   ( Updated:2022-11-06 02:14:58.0  )
అన్ని పార్టీల్లో గెలుపు ధీమా... అయినా లోలోపల ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు బై ఎలక్షన్ రిజల్ట్ పై ప్రధాన పార్టీల్లో టెన్షన్ పట్టుకుంది. మేమే గెలిస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తోన్నా లోపల మాత్రం ఓడిపోతే ఎలా అని దిగులు పట్టుకుంది. మునుగోడులో గెలిచిన పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని చర్చ రాజకీయ వర్గల్లో ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎలాగైనా మునుగోడులో గెలవాలనే పట్టుదలతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాయి. పోలీసులు, ఎన్నికల సంఘాన్ని అన్ని పార్టీలు బొల్తా కొట్టించాయి. గుట్టుచప్పుడు కాకుండా పోటీలు పడి ఓటర్లకు డబ్బులు పంచాయి. అన్ని పార్టీలు ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బు మొత్తం రూ. 200 కోట్లు దాటిందని ప్రచారం జరిగింది. ఇంత చేసినా ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తారని ఆందోళన అన్ని పార్టీల్లో ఉంది.


పార్టీ పట్టుదప్పే ప్రమాదం

మునుగోడులో పరాజయమైతే టీఆర్ఎస్ కు కష్టాలు స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ ఎన్నికల్లో గెలవకపోతే కేసీఆర్ పరువు పోవడంతోపాటు పార్టీ మనుగడకు ఇబ్బందులు తప్పవనే చర్చ ఉంది. ఇంతకాలం భయంతోనో, భక్తితోనే పదవులు ఇవ్వకున్నా.. కనీసం అపాయింట్మెంట్ దొరక్కపోయినా.. అవమానాలు ఎదుర్కోన్నా మౌనంగా ఉన్న లీడర్లు ఇక పార్టీని ధిక్కరించే చాన్స్ఉంది. అలాగే గెలిచిన పార్టీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతారు. ఆ జాబితాలో మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్, జూనియర్ లీడర్ల నుంచి గ్రామ స్థాయి లీడర్లు వరకు ఉంటారని ప్రచారం ఉంది. ఇలా అందరూ పార్టీ మారితే టీఆర్ఎస్ మనుగడ కష్టమని అభిప్రాయలు ఉన్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల ఎంట్రీకి కూడా పుల్ స్టాప్ పడుతుందని, కేటీఆర్ సీఎం అయ్యే అదృష్టం మిస్ అవుతుందని టాక్ ఉంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే బీజేపీ టార్గెట్

బై ఎలక్షన్ లో విజయం సాధిస్తే బీజేపీ దూకుడు మరింత పెంచనుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి భారీ స్థాయిలో వలసలు ఉండే చాన్స్ ఉంది. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలవడంతో పార్టీలో ఉత్సాహం పెరిగింది. ఇప్పుడు మునుగోడులో గెలిస్తే మరింత జోష్ రావడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం అయ్యే చాన్స్ ఉంది. మరోవైపు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నయం బీజేపీ అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లనున్నాయి. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది.

కాంగ్రెస్ మనుగడకే కష్టం

ఈ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోతే ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. సిట్టింగ్ స్థానంలో గెలవడం అటుంచి కనీసం డిపాజిట్ రాకపోతే కష్టాలు తప్పవని చర్చ ఉంది. ఇంతకాలం రాష్ట్రంలో ప్రత్యామ్నయం పార్టీగా ఉన్న కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్లనుంది. ఇప్పటికే చాలా మందిలీడర్లు వలసబాట పట్టారు. మునుగోడు ఫలితం తర్వాత ఉన్న కొద్దిమంది లీడర్లు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోనున్నారు. మరోవైపు నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా ఇంతకాలం ఉండేది. అనుకున్న ఫలితం రాకపోతే కంచుకోటలో బీటలు తప్పవని టాక్ ఉంది.

Read more :

1.మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఏడు అసెంబ్లీ బైపోల్ ఓట్ల లెక్కింపు



Next Story