KCR : కేసీఆర్‌కి షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్.. BRS విషయంలో గులాబీ బాస్ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?

by Disha Web Desk 19 |
KCR : కేసీఆర్‌కి షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్.. BRS విషయంలో గులాబీ బాస్ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేరుగా ఢీ కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు నిరాశను మిగిల్చబోతున్నాయా..? మరోసారి కమల వికాసమే అనే అంచనాలతో బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు. ఇప్పుడివే తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి. దీంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. ఇందులో దాదాపు అన్ని సంస్థలు బీజేపీకే పట్టం కట్టాయి. గుజరాత్‌లో ఏడో సారి తిరిగి కమలం పార్టీనే అధికార పీఠం అధిరోహించబోతోందనేది ఈ అంచనాలు రూఢీ చేస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ విషయంలో అధికార బీజేపీ, కాంగ్రెస్ నడుమ పోటాపోటీ ఉన్నా తక్కువ మెజార్టీతో అయినా బీజేపీనే గట్టెక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇక అంత ఉరుము ఉరిమి ఇంతేనా వాన అన్న చందంగా ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లోను సింగిల్ డిజిట్‌కే పరిమితం కాబోతోందనేది అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే బీజేపీ విధానాలు ఫెయిల్యూర్ అనే ప్రచారంతో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న కేసీఆర్‌కు ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు కీలకం కాబోతున్నాయనేది రాజకీయ పండితులు చెబుతున్న మాట.

కేసీఆర్‌కు మరింత కష్టం తప్పదా?

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చే ప్రక్రియ ముూడు నెలల క్రితమే మొదలైంది. ఈ నేపథ్యంలో దసరా పండగ నాడు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మారుస్తున్నట్టుగా సభ్యులు ఆమోదంతో తీర్మానం చేశారు. ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ ఈసీఐ వద్దకు చేర్చారు. బీఆర్ఎస్‌పై అభ్యంతరాలకు ఉన్న గడువు కూడా నేటితో ముగుస్తుంది. దాంతో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారిపోవడం లాంఛనమే అనే ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు వరకు బాగానే ఉన్నా కేసీఆర్‌కు అసలు సమస్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాల తర్వాతే ఉంటుందనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలను నమోదు చేసుకుంటే అది బీఆర్ఎస్ పార్టీకి మరింత ఇబ్బందిగా మారుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నేషనల్ పాలిటిక్స్‌లో గత కొంత కాలంగా బీజేపీ, కాంగ్రెస్ విధానాలను కేసీఆర్ విమర్శిస్తూ వస్తున్నారు. ముఖ్యమంగా మోడీ సర్కార్‌ను తూర్పారబడుతున్నాడు. వేదిక ఏదైనా విమర్శల్లో మాత్రం స్ట్రెయిట్‌గా మోడీనే టార్గెట్ చేస్తున్నాడు. మోడీ ఓ విఫల ప్రధాని అని పదే పదే చెబుతున్నాడు. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీకే బ్రహ్మరథం పడితే అప్పుడు కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ.. గుజరాత్ మోడల్‌ను ప్రమోట్ చేయడం కంటే మోడీ మేనియానే నమ్ముకుంది. ఇందుకు తగ్గట్టుగా సీఎంను చూసి కాదని తనను చూసి ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లను కోరడం ఆసక్తికర పరిమాణంగా మారింది. దీంతో ఈ విజయం నరేంద్ర మోడీ విజయంగా బీజేపీ మిగతా రాష్ట్రాల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది.

కేసీఆర్ మౌనం వెనుక రీజన్ ఇదేనా?:

నిజానికి హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కేసీఆర్ బీఆర్ఎస్‌ను అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సింఘ్‌వాఘేలా భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఆయన స్వయంగా ప్రగతిభవన్‌‌కు రావడం, ఇరువురు నేతలు దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చాలా సేపు చర్చించడంతో గుజరాత్ ఎన్నికల విషయంలో కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కనీసం ఆయన తన మద్దతుదారులను ఎన్నికల బరిలో దింపబోతున్నాడనే ప్రచారం జరిగింది. కానీ చంద్రశేఖర్ రావు ఊహించని మౌనం దాల్చారు.

కనీసం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు బీజేపీ విషయంలో ఎలాంటి విజ్ఞప్తి కూడా చేయలేదు. అయితే బీఆర్ఎస్‌కు ఈసీఐ అనుమతి వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో కార్యచరణ ప్రకటించాలనే ఉద్దేశంతోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో వ్యూహాత్మక మౌనం దాల్చారనే టాక్ టీఆర్ఎస్ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఇక ఇవాళ్టితో బీఆర్ఎస్‌పై అభ్యంతరాలకు గడువు పూర్తవనుండటంతో అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు వచ్చాక దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు ఉంటాయనే టాక్ కారు గుర్తు పార్టీలో జోరుగా వినిపిస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల విషయంలో దూరంగా ఉన్న కేసీఆర్ వచ్చే ఏడాది జరగనున్న ఛత్తీస్ గఢ్, కర్ణాటక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతారనేది ఆసక్తిగా మరింది.

Read more:

నెక్ట్స్ సీఎం ఎవరో ముందే చెప్పేసిన మంత్రి కేటీఆర్

కేటీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన మహిళా నాయకురాలు పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి


Next Story

Most Viewed