ఆ యూనివర్సిటీల్లో శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలి: బోయినపల్లి వినోద్ కుమార్

by Disha Web |
ఆ యూనివర్సిటీల్లో శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటు చేయాలి: బోయినపల్లి వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు కరీంనగర్, వరంగల్‌లలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) శాటిలైట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసి ఐదేళ్ల (డిగ్రీ, పీజీ కలిపి) ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. మంగళవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రెగ్యులర్ విద్యతో పాటు మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్‌ల పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 1,000 గురుకుల పాఠశాలలలో విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. ఈ గురుకుల విద్యాలయాలలో ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువు కుంటున్నారని, వారికి నాణ్యమైన ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు కరీంనగర్, వరంగల్‌లలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ( సెంట్రల్ యూనివర్సిటీ ) శాటిలైట్ ఇంటిగ్రేటెడ్ కోర్సుల క్యాంపస్ అవసరమని, ఇంటిగ్రేటెడ్ కోర్సులలో భాగంగా ఐదేళ్ల డిగ్రీ, పీజీ చదువు ఈ క్యాంపస్‌లోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 30శాతం సీట్లను కేటాయించాలని కోరారు.

1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ( సెంట్రల్ యూనివర్సిటీ ) ని 1975 లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (ఇ) మేరకు ఏర్పాటు చేశారని, తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలన్న లక్ష్యంతో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ) ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కరీంనగర్ వరంగల్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాటిలైట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌ను డిగ్రీ, పీజీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు సహకారాన్ని అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story