ఆ రోజు TRS, బీజేపీ నామరూపం లేకుండా పోతాయి: RS Praveen Kumar ఫైర్

by Disha Web Desk 19 |
ఆ రోజు TRS, బీజేపీ నామరూపం లేకుండా పోతాయి: RS Praveen Kumar ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్‌లను ఓడించే బలం కలిగిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. వేల ఏళ్లుగా బహుజనులు ఎలా అణిచివేయబడ్డారో, ఎలా మోసానికి గురయ్యారో బహుజనులకు అర్థమైన రోజు బీజేపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలు నామరూపం లేకుండా పోతాయని ఆర్ఎస్పీ విమర్శించారు. ఇంతకాలం బహుజనులకు వారి చరిత్రను చెప్పలేదని, వారికి జరిగిన అన్యాయాన్ని వివరించలేదని పేర్కొన్నారు. కానీ బీఎస్పీ పార్టీ బహుజనులకు వారి చరిత్రను బోధించి, వారికి జరిగిన అన్యాయాన్ని తెలుపుతూ, వారి న్యాయమైన హక్కుల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు.

మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బహుజన రాజ్యాన్ని సాధించడమే అంబేడ్కర్‌కి మనమిచ్చే ఘన నివాళి అని అన్నారు. ఈ మూడు రోజుల శిక్షణ తరగతుల ద్వారా బహుజన సిద్ధాంతం బోధించి, ప్రజలను చైతన్య పరచడం ద్వారా బీఎస్పీ పార్టీ నిర్మాణం అభివృద్ధి పరిచి బహుజన రాజ్యాధికారానికి దారులు వేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానందరావు, రాష్ట్ర కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్, మహిళా కన్వీనర్ అనితా రెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story