'ఆడ పిల్లలపై వివక్ష రూపుమాపాలంటే.. ముందు ఆ వ్యవస్థలో మార్పు రావాలి'

by Disha Web Desk 13 |
ఆడ పిల్లలపై వివక్ష రూపుమాపాలంటే.. ముందు ఆ వ్యవస్థలో మార్పు రావాలి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఆడపిల్లలపై వివక్ష రూపు మాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ అధికారి మోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ అమోయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆడ, మగ అనే తేడాలు పిలిచే పిలుపులో ఉండాలి తప్ప చూపించే ప్రేమ లో ఉండకూడదని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆడ పిల్లలు వివక్షకు గురవుతున్నారని అన్నారు.


గ్రామీణ ప్రాంతాలలో ఈ వివక్ష ఎక్కువగా ఉన్నదని ఈ జాఢ్యాన్ని రూపుమాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని అన్నారు. అమ్మాయిలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని, బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. పాఠశాలల్లో విద్యార్ధి, విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన, ప్రతి అంశం పై చర్చించే విధంగా శిక్షణ ఇవ్వాలని డీఈఓ కు సూచించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీదేవి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, టీచర్లు స్నేహభావంతో ఉన్నప్పుడు సమాజంలో అమ్మయిలు ఎదుర్కొంటున్న సమస్యలను వారితో ధైర్యంగా చేపగలుగుతారని తెలిపారు.


అధికారులు, ఎన్జీఓలు గ్రౌండ్ స్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని, అమ్మయిలను గర్బస్థ శిశువు నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. అనంతరం బాలికలు సమాజానికి మణిహారం బాలికలకు రక్షణ కల్పిద్దాం వారి బంగారు భవితకు పునాది వేదం స్వేచ్ఛాయుతమైన వాతావరణం, పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడుదాం 'బాలికలను బ్రతకనిద్దాం, చదవనిద్ధాం', 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం మన వంతు సహాయం అందించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.


అమ్మయిలు వారి వారి అనుభవాల గురించి తెలిపారు. బేటీ బచావో-బేటీ పఢావో కాలెండర్, కెరీయర్ గైడెన్స్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ విడుదల చేశారు. వివిధ అంశాలలో, జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంస పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, మహిళా, శిశు సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ విశాల, సీడబ్ల్యూసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, అంజన్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మోతి, సూపర్ వైజర్స్, చైల్డ్ లైన్ కోర్డినేటర్లు, వివిధ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, వివిధ ఎంన్జీవో ల అధికారులు పాల్గొన్నారు.


Next Story