బిల్లులు రాక గొల్లుమంటున్న సర్పంచులు

by Disha Web Desk 15 |
బిల్లులు రాక గొల్లుమంటున్న సర్పంచులు
X

దిశ,తాండూరు రూరల్ : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు నిలిచిపోయి, అప్పు చేసి చేపట్టిన అభివృద్ధి పనులకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని జిల్లాలోని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 566 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామపంచాయతీల పరిధిలో రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు మొదలగు అభివృద్ధి పనులను సర్పంచులు చేపట్టారు. ఎన్ఆర్జీఎస్ స్కీం కింద శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలకు సర్పంచులు లక్షల రూపాయల్లో అప్పులు తెచ్చి పనులు పూర్తిచేసి, బిల్లుల కోసం సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నారు. సర్పంచ్ గా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటికే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేసినా, ఏ పనికి ఇంతవరకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదని వారు వాపోతున్నారు. నెల నెలా రావాల్సిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వ నిధులు సైతం నిలిచిపోయాయని, గ్రామపంచాయతీల నిర్వహణ, మల్టీపర్పస్ సిబ్బందికి సైతం వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నెలా వచ్చే నిధులతోనే విద్యుత్ బిల్లులు, జీపీ ట్రాక్టర్ కిస్తీలు, మల్టీపర్పస్ సిబ్బంది వేతనాలు చెల్లించాల్సి ఉంది. కొన్ని నెలలుగా ఇటు రాష్ట్రం, అటు కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సైతం రాక వేతనాలు చెల్లించలేక పోతున్నారు.

పనులే భారం..

ప్రతి గ్రామంలో హరితహారం నర్సరీల నిర్వహణ, ఆ మొక్కలను కాపాడటం, గ్రామీణ పార్కులు, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు.. ఇవన్నీ ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యత సర్పంచులకు అప్పగించింది. కానీ, అందుకు తగిన నిధులు సమయానికి ఇవ్వడం లేదు. పనులు పూర్తి చేయాలని మాత్రం ఉన్నత అధికారులు తీవ్ర ఒత్తిడి తేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టినట్టుగా సర్పంచులకు కూడా టార్గెట్ పెట్టారు. నోటీసులు ఇచ్చారు. పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ డబ్బులు మాత్రం ఇవ్వడం మానేశారు. టార్గెట్లు పూర్తి చేయడం కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేయించిన సర్పంచులు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్నారు.

తెచ్చిన అప్పులు తీరేనా..?

పల్లెల సమగ్రాభివృద్ధి చేసిన పలు పనులకు బిల్లులు రావడంలేదు. అప్పు చేసి పనులు చేస్తున్నామని, సకాలంలో నిధులు రాకపోవడంతో తాము మరింత అప్పుల పాలు కావాల్సి వస్తోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగినందుకు సంతోషపడాలో? అందుకు చేసిన ఖర్చులకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఉందని మొత్తుకుంటున్నారు. ఇప్పటికే పూర్తి చేసిన పనుల బిల్లులను వెంటనే విడుదల చేసి అప్పుల భారంతో మగ్గుతున్న సర్పంచులను ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సర్పంచులు ఉక్కిరి బిక్కిరి అన్నిట్లా రాష్ట్ర సర్కారుదే పెత్తనం. ప్రభుత్వ తరపున ఆఫీసర్లదే పెద్దరికం. ఆఫీసర్లు చెప్పిన దానికి ఊ అనకపోతే షోకాజ్ నోటీసులు తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరు పై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో సర్పంచులకు తలనొప్పిగా మారింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్ బిల్లులు చెల్లించలేకపోవడంతో సర్పంచులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచులకు ఇంత ఇబ్బందులు ఉండేవి కాదని వారు పలు సందర్భాల్లో చెప్పుకుంటున్నారు.


Next Story

Most Viewed