నీట మునిగిన పెద్ద గోల్కొండ టోల్ ప్లాజా

by Disha Web Desk 20 |
నీట మునిగిన పెద్ద గోల్కొండ టోల్ ప్లాజా
X

దిశ శంషాబాద్ : పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ పూర్తిగా నీట మునిగింది. ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఎక్కడానికి, దిగడానికి ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాలోకి నీరు చేరడంతో రాకపోకలను ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో మండలంలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ గ్రామంలోని బైరమోని చెరువు పూర్తిగా నిండి అలుగు పారడంతో అక్కడి నుంచి వచ్చిన వరద నీరంత నేరుగా ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ కిందికి చేరింది. వరద నీటిలో టోల్ ప్లాజా మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దగోల్కొండ నుండి శంషాబాద్ వెళ్లాలంటే ఔటర్ రింగ్ రోడ్డు అండర్ పాస్ దాటి వెళ్లాల్సి ఉంటుంది.

ఇప్పుడు అక్కడ వరద నీరు సుమారు 8 అడుగుల మేర ఉండడంతో అధికారులు వాహనాల రాకపోతులను పూర్తిగా నిలిపివేశారు. నిత్యం నాగారం, అమీర్పేట్, కోళ్ల పడకల్, మహేశ్వరం తదితర గ్రామాల నుండి వేలాది మంది రైతులు పండించిన పంటను తీసుకొని శంషాబాద్ లోని కూరగాయల మార్కెట్ కు వస్తూ ఉంటారు. పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ పూర్తిగా నీడమనగడంతో‌ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ 10 కిలోమీటర్ల వేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండీ అధికారులు, టోల్ ప్లాజా అధికారులు టోల్ వసూల్ మీద ఉండే శ్రద్ధ వరద నీరును తొలగించడంలో లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.‌ ఇకనైనా అధికారులు వరద నీరును తొలగించి రాకపోకలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed