- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గర్భిణీల చెంతకు ప్రైవేటు మహిళా వైద్యులు.. కోత కాన్పులకు చెక్ పెట్టేలా..

దిశ ప్రతినిధి, నిర్మల్ : కోత కాన్పులకు చెక్ పెట్టేందుకు నిర్మల్ కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లాలో ప్రైవేటు నర్సింగ్ హోమ్లు, హాస్పిటల్స్ నడుపుతున్న మహిళా వైద్యులు, గైనకాలజిస్టులు ఇప్పుడు పల్లెబాట పట్టారు. గర్భిణీల చెంతకు వెళ్లి కోతకాన్పులు ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చాలా మంచిదని సాధారణ కాన్పులు తల్లి బిడ్డలకు ఆరోగ్యకరమని ఉద్బోధ చేస్తున్నారు. ప్రైవేటు వైద్యులు తమ వద్దకు కాకుండా.. ప్రభుత్వ దవాఖానకు సుఖప్రసవాల కోసం వెళ్లాలని చెబుతుండడం.. వినడానికి వింత గానే ఉన్నా నిర్మల్ జిల్లాలో ఇప్పుడు అదే జరుగుతోంది. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఈ వినూత్న ప్రయోగానికి తెర లేపారు. గత వారం రోజులుగా ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతున్న మహిళా వైద్యులు జిల్లాలో ఉన్న మారుమూల గ్రామాలకు వెళ్లి సుఖ ప్రసవాలు, సాధారణ కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్న సేవలను వివరిస్తున్నారు.
శభాష్...ముషారఫ్..!
కోత కాన్పులకు ( సిజెరియన్ డెలివరీ) చెక్ పెట్టేలా నిర్మల్ జిల్లా కలెక్టర్ ముసారఫ్ అలీ ఆలోచన వైద్యారోగ్య శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే సిజేరియన్ డెలివరీల అంశంలో తెలంగాణ ముందు వరుసలో ఉండగా నిర్మల్ జిల్లాలో ఇలాంటి కోత కాన్పులు పెద్ద మొత్తంలో జరుగుతున్నయన్న నివేదిక నేపథ్యంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైంసా ఖానాపూర్ పట్టణాల్లో ప్రాక్టీస్ చేస్తున్న ప్రైవేటు గైనకాలజిస్టులు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా వైద్యులను నేరుగా గర్భిణీల చెంతకు పంపేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఒక్కో వైద్యురాలు రోజుకు రెండు నుంచి మూడు గ్రామాలకు వెళ్లి అక్కడ ఆరోగ్య సిబ్బంది సహకారంతో గర్భినీ లను కలుస్తున్నారు.
కోత కాన్పుల వల్ల జరిగే నష్టాలను మహిళలకు వివరిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేస్తున్నారని కొందరు మహిళా వైద్యులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని నేరుగా గర్భిణీల చెంతకు వెళ్లి సిజేరియన్ డెలివరీల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో, సాధారణ కాన్పుల వల్ల జరిగే ప్రయోజనాలను వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే ప్రభుత్వ దవాఖానాల్లో లభిస్తున్న మాత శిశు సంరక్షణ సేవలు సాధారణ కాన్పుల కోసం తీసుకుంటున్న చర్యలపై కూడా మహిళా వైద్యులు వివరించి వారిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగేలా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రతినిత్యం ప్రైవేట్ నర్సింగ్ హోమ్లలో బిజీగా ఉండే ప్రైవేటు మహిళా వైద్యులు తమ గ్రామాలకు వచ్చి సిజేరియన్ కాన్పులు వద్దని చెబుతుండడంతో గ్రామాల్లో మహిళలు ఆశ్చర్యపోతున్నారు.
వర్కవుట్ అవుతుందా..?
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వెళ్లే మహిళలపై కన్నేసి దారి మళ్లించి ఇన్నాళ్లు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకువెళ్లిన కొందరు దళారీలకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఆలోచన మింగుడు పడనిదిగా తయారయింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొంతమంది ప్రైవేటు వైద్యుల (ఆర్ ఎం పీ) మూలంగా ప్రభుత్వ దవాఖానాలలో ప్రసవాలు గణనీయంగా తగ్గాయి. దీనికి తోడు కొందరు మహిళా వైద్యులు ధనార్జన కోసం సాధారణ కాన్పులు జరిగే అనేక కేసులను సిజేరియన్ లుగా మార్చి డెలివరీలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మేరకు కలెక్టర్ తన సొంత ఇంటలిజెన్స్తో సమాచారం సేకరించి ఈ తాజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ప్రైవేటు మహిళా వైద్యులు నేరుగా సిజేరియన్ కాన్పులు ప్రమాదకరమని గర్భిణీల వద్దకు వచ్చి చెబుతుండడం చూస్తే... ఒకవేళ గర్భిణీలు తమ వద్దకు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిన మహిళా వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు సిజేరియన్ చేయకుండా సాధారణ కాన్పులు చేసే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇది మంచి పరిణామం అని వైద్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ డిసెంబర్ నెలాఖరు నాటికి జిల్లాలో సాధారణ ప్రసవాలు పెంచాలని ఆ దిశగా మహిళా వైద్యులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముసారఫ్ అలీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొన్నిచోట్ల సిజేరియన్ కాన్పులు జరుగుతున్నట్లు ఆయన దృష్టికి వెళ్లిన నేపథ్యంలో దానిపై కూడా గర్భిణీలు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి సాధారణ కాన్పులు జరిగేలా చూడాలని సూచించారు. కలెక్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందని వైద్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.