కలెక్షన్స్‌లో RRR సినిమా రికార్డ్స్‌ను ‘ఆర్ఆర్’ ట్యాక్స్ మించిపోయింది: మోడీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
కలెక్షన్స్‌లో RRR సినిమా రికార్డ్స్‌ను ‘ఆర్ఆర్’ ట్యాక్స్ మించిపోయింది: మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. బుధవారం వేములవాడలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలు నాణేనానికి బొమ్మ, బొరుసులని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలను కలుపుతోంది అవినీతేనని ధ్వజమెత్తారు. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి కాపాడాలని పిలుపునిచ్చారు. బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఫ్యామిలీ ఫస్ట్ అని ఫైర్ అయ్యారు. అవినీతి అనేది కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో కనిపించే ఉమ్మడి లక్షణమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పై ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్.. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేకపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్‌పై బీఆర్ఎస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని నిప్పులు చెరిగారు.

అవినీతి సిండికేట్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ భాగస్వాములని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసని, వసూళ్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను ఆర్ఆర్ ట్యాక్స్ మించిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా వెయ్యి కోట్లు సాధిస్తే.. ఆర్ఆర్ మాత్రం కొన్ని రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసిందని సెటైర్ వేశారు. ఆర్ఆర్ నుండి తెలంగాణకు విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. అంబానీ, అదానీని ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆపేసిందని, మరీ వాళ్ల దగ్గర నుండి కాంగ్రెస్ ఎంత డబ్బు తీసుకుందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని.. కనీసం ఆయన పార్థివదేహాన్ని పార్టీ ఆఫీసులోకి కూడా రానివ్వలేదన్నారు. కానీ పీవీకి మా బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసి గౌరవించిందని గుర్తు చేశారు.

Next Story