కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరు ?

by Dishanational1 |
కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరు ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామబాద్ పోలీసు కమిషనర్ గా ఏడాది కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కమిషనర్ అధికార పార్టీ నేతల అందరి తలలో నాలుకగా మెదిలారు. అయితే ఎప్పుడైనా ఎన్నికల నగారా మోగుతుందనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో కొత్తగా పోలీస్ కమిషనర్ ను నియమిస్తారనే రాజకీయ వర్గాల్లోనూ చర్చించుకుంటున్నారు. పోలీసు కమిషనర్ గా బాధ్యతల నుంచి తప్పించుకున్న తర్వాత తన భవిష్యత్తు గురించి ఇప్పటికే కె.ఆర్.నాగరాజు పలు మీడియా సమావేశాల్లోనూ వ్యక్తిగతంగా పలువురి వద్ద చర్చించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో అప్పటివరకు తనను ఓఎస్డీగా అయినా, ఏదైనా శాఖకు పంపిస్తారని కె.ఆర్.నాగరాజు ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన విందుకు హాజరుకావడంతో సీపీ భవిష్యత్తు రాజకీయాల వైపు అడుగేస్తున్నారని అనుమానాలకు తావిస్తుంది. కమిషనర్ గా కె.ఆర్. నాగరాజు హయంలో సక్సెస్ రేషియో సంగతి పక్కన పెడితే కమలం పార్టీ నాయకులకు, సీపీకి కొరకరాని కొయ్యగా మారారని చెప్పాలి. సీపీపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ పార్లమెంటరీ సభా కమిటీతోపాటు కేంద్ర హోం శాఖకు సైతం ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడితోపాటు నిజామాబాద్ లో ఉన్న శాంతిభద్రతల సమస్యలను తెలుపుతూ ఫిర్యాదు చేయడంతో ఇంకా ఈ విషయంపై నోటీసులు ఇచ్చినా విచారణ జరుగలేదు. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ గా ఉన్న కె.ఆర్.నాగరాజుకు కొనసాగింపు అనేది రాలేదని చర్చ జరుగుతుంది.

నిజామాబాద్ ప్రస్తుత కమిషనర్ కె.ఆర్.నాగరాజు పదవి విరమణ ఈ నెల 31న జరగడం ఖాయమైందని చెప్పాలి. ఈ నెల 24న జిల్లా కేంద్రంలో జరిగిన పోలీసు కమాండ్ కంట్రోల్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా రావాల్సిన అధికారులు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజామాబాద్ లో పోలీసు శాఖలో పని చేసిన ఓ మహిళా అధికారిని నిజామాబాద్ సీపీగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పోలీసు వర్గాల భోగట్టా. సీఎం పేషిలో భద్రత వ్యవస్థలో పని చేస్తున్న మరో అధికారి సైతం నిజామాబాద్ సీపీగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పట్లో కొత్తగా కమిషనర్ ను నియమించకపోవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ఇంచార్జిగా బాధ్యతలు ఇస్తారనే చర్చ కూడా జరుగుతుంది. నిజామాబాద్ అధికార పార్టీ నేతల చల్లని చూపు ఎవరిపై ఉంటుందో వారే కొత్త కమిషనర్ గా నియమితులవుతారనడంలో సందేహం లేదు. కానీ రాజకీయ నాయుకలు ఫక్తు తమ ప్రయోజనాలు ఆశించి ముఖ్యంగా 2023 చివరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని నమ్ముతుండడంతో కొత్త బాస్ నియామకంపై ఆచితూచిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన సీఐలను, ఎస్సైలను ఇతర ప్రాంతాలకు పంపిస్తూ కొత్త వారిని నియమించుకుంటున్నారు. తాజాగా ఏసీపీలను సైతం మార్చివేసి కొత్తవారిని నియమించుకోవడం వెనుక లాంగ్ ఫిరియడ్ తోపాటు లోకల్ వారిని సాగనంపి ఎన్నికల సంఘం కంటపడకుండా ముందు జాగ్రత్త పడుతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కొత్త బాస్ వ్యవహరం రెండు, మూడు రోజుల్లో ఫైనల్ కావడం జరుగుతుందని చెప్పాలి.


Next Story

Most Viewed