అర్హులైన రైతులందరికీ లక్ష రుణమాఫీ వర్తించేలా చూడాలి

by Sridhar Babu |
అర్హులైన రైతులందరికీ లక్ష రుణమాఫీ వర్తించేలా చూడాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు సూచించారు. బుధవారం జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరుగగా, వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరుపై ముందుగా సమీక్షించారు. రైతులకు రుణమాఫీ చేయాలని సభ్యులు కోరగా, అర్హులైన వారందరికీ రూ. లక్ష రుణమాఫీ ద్వారా ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాలని సంబంధిత వ్యవసాయ అధికారులతో పాటు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ను జెడ్పీ చైర్మన్ సూచించారు. కాగా ఈసారి ఖరీఫ్ లో జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేయగా, 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని పౌరసరఫరాల శాఖ అధికారులు సమావేశంలో సభ్యుల దృష్టికి తెచ్చారు.

ఇందులో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులు కొంతమేర ఎక్కువ ధర చెల్లించడంతో అనేకమంది రైతులు వారికి పంటను విక్రయించారని అన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగలిగామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 50,732 మంది రైతుల ఖాతాల్లో 80 శాతం మేర 714 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని, మరో వారం రోజుల్లో మిగతా 20 శాతం బిల్లుల చెల్లింపులు పూర్తి చేస్తామని అన్నారు. అదేవిధంగా రైసు మిల్లులకు కేటాయించిన లెవీ లక్ష్యంలో 92 శాతం సీఎంఆర్ సేకరణ పూర్తయ్యిందని, ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో సేకరిస్తామని సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ జగదీశ్ సభ్యుల దృష్టికి తెచ్చారు. కొత్త రేషన్ కార్డుల గురించి సభ్యులు ప్రస్తావించగా, ప్రభుత్వం నుండి ఉత్తర్వులు

అందిన వెంటనే దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని డీఎస్ఓ చంద్రప్రకాష్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 259 రేషన్ షాపుల ద్వారా సుమారు 4,51,200 పైచిలుకు కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోందని వివరించారు. ఆసరా పెన్షన్ల వయోపరిమితి 57 సంవత్సరాలకు తగ్గించిన మేరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేసేలా ప్రభుత్వానికి నివేదించాలని సమావేశంలో సభ్యులు కోరారు. వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ జరపాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్ కు జెడ్పీ చైర్మన్ ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ గోవింద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆయా మండలాల జెడ్పీటీసీ లు, ఎంపీపీలు పాల్గొన్నారు.

తుతూ మంత్రంగా సమావేశం

జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఆరు నెలలకు ఒకసారి జరిగే జిల్లా పరిషత్ సమావేశం బుధవారం తుతూ మంత్రంగా సాగింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు లేకుండా జెడ్పీ సమావేశం జరిగింది. ఎన్నికలకు ముందు జరగాల్సిన జెడ్పీ సమావేశం జిల్లా పరిషత్ అవిస్వాస తీర్మానం లొల్లి నేపథ్యంలో వాయిదా పడింది. ఎన్నికలకు వెళ్తున్నామని కోరం లేదంటు అప్పుడు తప్పించుకున్న అధికార పార్టీ నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడిన 3 రోజులకే హడావిడిగా సమావేశం నిర్వహించి మమా అనిపించారు.

కొత్తగా ఎన్నికైనా ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందలేదని, పాత ఫార్మట్ ప్రకారం పాత ఎమ్మెల్యేల పేరనే సమావేశం ఆహ్వాన పత్రాలను అందించారని తెలిసింది. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఓటమి చెందగా గెలిచిన వారు హైద్రాబాద్ కు పరిమితం కావడంతో జెడ్పీ సమావేశానికి రాలేదని సమాచారం. మళ్లీ ఆరు నెలలకు ఒక్కసారి జరిగే సమావేశాలకు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయోనని హడవిడిగా సమావేశం జరపించి మమా అనిపించారని చర్చ జరగుతుంది.



Next Story

Most Viewed