కమలాపురంలో భూమి వివాదం

by Sridhar Babu |   ( Updated:2023-08-03 16:27:23.0  )
కమలాపురంలో భూమి వివాదం
X

దిశ, కారేపల్లి : కారేపల్లి మండలం కొత్తకమలాపురంలో భూ వివాదం రగులుతుంది. గురువారం మాజీ నక్సల్స్‌ కుటుంబాల వారు తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని కొందరు అక్రమించారని వివాదంగా ఉన్న భూమిలో ట్రాక్టర్లతో దున్నారు. దాంతో ఆ భూమిని సాగు చేస్తున్న కమలాపురంనకు చెందిన రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. వివరాలలోకి వెళితే... కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన ఆలెం కృష్ణ, చర్లపల్లి కి చెందిన గలిగె కోటయ్యలు మాజీ నక్సల్స్‌. వారు ప్రభుత్వానికి లొంగిపోవడంతో పునరావాసం కింద 2003 సంవత్సరంలో కమలాపురం రెవెన్యూ పరిధిలోని 147/7 లో 4.37 ఎకరాలు,

147/8లో 4.38 ఎకరాలను కేటాయించింది. అప్పటికే ఆ భూమిని ఆ గ్రామానికి చెందిన వారు సాగు చేసుకుంటూ అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో 147/7 లో 4.37 ఎకరాలు, 147/8లో 4.38 భూమి మాదంటూ కొంతకాలగా మాజీ నక్సల్స్‌ కుటుంబాలు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు లేక పోవటంతో వారు భూమి మీదకు వెళ్లారు. దాంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఆదివాసీ గిరిజనులైన మాజీ నక్సల్స్‌కు ప్రభుత్వం ఇచ్చిన భూమి కొందరు ఆక్రమించారని ఆదివాసి సంక్షేమ పరిషత్‌ నాయకులు వట్టం నాగేశ్వరరావు, తుడుందెబ్బ నాయకులు కల్తి రాంప్రసాద్‌లు ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తక్షణమే నక్సల్స్‌కు భూమి దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.



Next Story

Most Viewed