సమిష్టి కృషి అవసరం....నిజామాబాద్ నగర అభివృద్ధిపై సీఎం సమీక్ష

by Disha Web Desk 15 |
సమిష్టి కృషి అవసరం....నిజామాబాద్ నగర అభివృద్ధిపై సీఎం సమీక్ష
X

దిశ ప్రతినిధి నిజామాబాద్ : ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని సీఎం చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల సమీక్ష, నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఫలితంగా అమలులోకి వచ్చిన స్వయం పాలనలోని ప్రగతి సమిష్టి కృషికి నిదర్శనమని తెలిపారు. స్వరాష్ట్రంలో ఒక్కొక్క రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషి ఇమిడి ఉన్నదన్నారు. సాధించినదానికి సంతృప్తి చెంది ఆగిపోకుండా ఇంకా గొప్పగా ఆలోచించాలని అన్నారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిన నాడే గుణాత్మక ప్రగతిని మరింతగా ప్రజలకు చేరవేయగలుగుతామని ప్రభుత్వాధికారులకు సూచించారు. రోటీన్ గా అందరూ పనిచేస్తరు కానీ మరింత గొప్పగా ఎట్లా పనిచేయాలనేదే ముఖ్యం అన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన అవసరమున్నదని, తెలంగాణలో పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా ప్రజలకు అందాల్సిన నాణ్యమైన సౌకర్యాల కోసం అందరం కలిసి పని చేయాలని కోరారు. ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేని సందర్భాల్లోంచి నేడు అన్ని రంగాల్లో గుణాత్మకాభివృద్ధిని తెలంగాణ సాధించిందని అన్నారు. వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజలకు అందాయని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా ప్రగతిని సాధించిందని, తదనుగుణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని తెలిపారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు నేడు ఆర్థికంగా బలపడుతున్నాయన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు.

నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలే

ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని సీఎం స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలని, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గణేశ్​ను కోరారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన నిధులతో పాటు నిజామాబాద్ నగరాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సమావేశం నుండే ఫోన్ చేసి ఆదేశించారు. ఒకనాడు గందరగోళంగా ఉన్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరం గా మారిందని, అలాగే ఇక్కడ కూడా తీర్చిదిద్దాలని సూచించారు. రోడ్ల నిడివి అంచనా వేసి గ్రావెల్ రోడ్లను బీటీలుగా మార్చాలని చెప్పారు. శ్మశాన వాటికలు, బరీయల్ గ్రౌండ్లు, సమీకృత మార్కెట్లు , కమ్యునిటీ హాళ్లు, డంప్ యార్డులు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు ఎన్ని కావాల్సి ఉందో నిర్ణయించి వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మాడ్రన్ దోభీఘాట్లు, మోడ్రన్ సెలూన్లను నిర్మించాలన్నారు. నగరంలో గార్డెన్ల పరిస్థితిని సీఎం అడిగి తెలసుకున్నారు. పబ్లిక్ గార్డెన్లను తక్షణమే మెరుగు పరచాలన్నారు. తాను చిన్నప్పుడు తిలక్ గార్డెన్ లో కూర్చునే వాడినని గుర్తు చేసుకున్నాడు. రైల్వే స్టేషన్ ను సుందరీకరించాలని కోరారు. నగరంలో మొత్తం ఉన్న ప్రభుత్వ భూములెన్ని, వాటిల్లో ప్రజావసరాలకోసం వినియోగించుకోవాడనికి ఎన్ని అనువుగా ఉన్నాయో ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖలు వారి కార్యాలయాలను ఖాళీ చేశాయని, ఆయా శాఖల భవనాల పరిస్థితి ఏందని, వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు ఏ విధంగా వినియోగించుకోవచ్చునో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆ శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దడంలో మున్సిపల్ శాఖ కృషిని తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీ కవిత సీఎం ను అభ్యర్థించారు. నగరంలో బస్టాండ్ నిర్మాణానికి విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత వివరించారు. హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ తో పాటు, జీవన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ , డైరెక్టర్ సత్యనారాయణ, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ చిత్ర తో పాటు నిజామాబాద్ జిల్లా పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Next Story