కాళోజీ హెల్త్ యూనివర్సిటీ‌లో జిమ్మిక్కులు.. పీజీ మెడికల్‌లో కొత్త నిబంధన

by Mahesh |
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ‌లో జిమ్మిక్కులు.. పీజీ మెడికల్‌లో కొత్త నిబంధన
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీజీ మెడికల్ సీట్ల భర్తీలో కొత్త రూల్ వచ్చింది. సీట్ల భర్తీలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెచ్చిన కొత్త నిబంధన నష్టం చేకూర్చే విధంగా ఉన్నదని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. తొలిసారి సీట్ల స్లైడింగ్​ఆప్షన్లు (సీటు వచ్చినా తదుపరి కౌన్సిలింగ్‌కు అవకాశం) ఎత్తివేయడం వలన సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్ ఉన్న విద్యార్థులకు మంచి కాలేజీలో అవకాశం పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరకు ఉన్న స్లైడ్ ఆప్షన్‌ను ఉన్నట్టుండి తీసివేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.

వివాదమేంటి? వర్సిటీ ఏం చేసింది...?

మెడికల్ పీజీ సీట్ల భర్తీకి ప్రతి ఏడాది ఆలిండియా కోటాలో రెండు సార్లు కౌన్సిలింగ్ జరుగుతుంది. స్టేట్​లో అంత కంటే ఎక్కువసార్లే నిర్వహిస్తున్నారు. ఆలిండియా రెండో కౌన్సిలింగ్​లో మిగిలిన సీట్లు ఆటోమేటిక్​గా రూల్స్​ప్రకారం స్టేట్​కు కన్వర్ట్​అవుతాయి. అయితే కొత్త నిబంధన ప్రకారం ఆలిండియా కోటా సెకండ్​రౌండ్​లో సీటు తీసుకొని వదిలేసిన వారికి స్టేట్​ కౌన్సిలింగ్​లో పాల్గొనే ఛాన్స్ ఉండదు. సీటు బదలాయించే అవకాశం లేనందున కచ్చితంగా తీసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.

ఈ రూల్​తో ఏం జరుగుతుంది?

పాత నిబంధన ప్రకారం మొదటి కౌన్సిలింగ్‌కు సీటు వచ్చినా.. తర్వాతి రౌండ్​ కౌన్సిలింగ్‌కు కూడా చాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి విధానాన్ని హెల్త్ వర్సిటీ ఎత్తివేసింది. ఉదాహరణకు మెడికల్ పీజీ ప్రవేశాలకు ఓ విద్యార్థికి పదో ర్యాంక్​ వచ్చిందనుకుంటే, ఉస్మానియా మెడికల్​కాలేజీలో జనరల్ సర్జరీ కోర్సులో సీటు వస్తుంది. ఇప్పుడు వాళ్లకు తర్వాత రౌండ్​కౌన్సిలింగ్​కు అవకాశం ఇవ్వకపోతే, అంతకంటే మంచి కోర్సులోకి మారే అవకాశం ఉండదు. దీంతో 20, 30 ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు ఆ సీటు కేటాయిస్తారు. ఇలా కొన్నిసార్లు మెరిట్ వచ్చి నాన్​క్లినికల్ సీట్లు పొందిన విద్యార్థులకు క్లినికల్ సీట్లు లభించే అవకాశాన్ని మిస్ అవుతారు. అందుకే పాత రూల్‌నే కొనసాగించాలని విద్యార్ధులు డిమాండ్​చేస్తున్నారు.

చేరిన వాళ్లకైనా ఇవ్వండి

పీజీ మెడికల్​సెకండ్ కౌన్సిలింగ్‌లో సీటు పొంది, ఇప్పటికే కాలేజీల్లో చేరిన వాళ్లకు అప్​గ్రేడేషన్​కు ఛాన్స్​ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం నాన్ క్లినికల్​సీట్లలో ఉన్న మెరిట్​విద్యార్థులకు ఏదైనా కాలేజీలో క్లినికల్​సీట్లు ఉంటే మారే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి రూల్ మారడంతో వందల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాది సీట్లు మిగిలి పోవడం వల్లనే ఈ సమస్య వస్తున్నదని కాళోజీ వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. మిగులుతున్న సీట్లు నాన్​క్లినికల్ వని.. ఒక్క ఏడాది కూడా క్లినికల్‌లో​సీటు కూడా మిగలలేదని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల ఒత్తిడి మేరకు వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరి కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story