జీవితంలో స్థిరపడే వరకు సహాయం అందిస్తా : కలెక్టర్ ఎం.హనుమంతరావు

by Sumithra |
జీవితంలో స్థిరపడే వరకు సహాయం అందిస్తా : కలెక్టర్ ఎం.హనుమంతరావు
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : జీవితంలో స్థిరపడే వరకు సహాయం అందిస్తానని తాను దత్తత తీసుకున్న 10వ తరగతి విద్యార్థి కుటుంబానికి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భరోసానిచ్చారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర చారి ఇంటికి జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లారు. పదవ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన తెల్లవారుజామునే విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శేరిగూడం గ్రామానికి చెందిన భరత్ చంద్ర చారి ఇంటికి వెళ్లిన విషయం తెలిసింది. ఆ సమయంలో భరత్ చంద్ర చారి కుటుంబ పరిస్థితిని చూసి చలించిన జిల్లా కలెక్టర్ పదో తరగతి పూర్తయ్యే వరకు తాను సాయం అందిస్తానని బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు.

అందులో భాగంగా ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో భరత్ చంద్ర చారి 73% మార్కులు సాధించడంతో స్వయంగా జిల్లా కలెక్టర్ ఇంటికి వచ్చి భరత్ చంద్ర, ఆయన తల్లి విజయలక్ష్మిలను సన్మానించారు. ఈ సందర్భంగా నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదే విధంగా భవిష్యత్తులో భరత్ అనుకున్న లక్ష్యం సాధించే వరకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఏ అవసరమున్నా తనను సంప్రదించవచ్చునని ఆయన భరత్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా భరత్ చంద్ర ఆయన తల్లి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన సహకారంతోనే పదో తరగతి పరీక్షల్లో తన కుమారుడు మంచి మార్కులు సాధించాడని విద్యార్థి తల్లి తెలిపారు.

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి..

అనంతరం గుడిమల్కాపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారిణి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలని సూచించారు. ఆయన వెంట చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఎస్సై జగన్, ఆర్ఐ కట్ట పాండు, ఏఈఓ శశి బిందు, పంచాయతీ కార్యదర్శి సుభాష్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed