- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెవెన్యూ అధికారుల పై విచారణ సరే.. చట్టపరమైన చర్యలేవి

దిశ, నల్లగొండ బ్యూరో : రెవెన్యూ అధికారుల పై వచ్చిన అవినీతి ఆరోపణలు స్పష్టంగా కళ్ళముందున్నాయి. అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి... తప్పు చేసిన అధికారులు కూడా వాళ్లు తప్పు చేసామని ఒప్పుకున్నారు... అయినా ఇప్పటి వరకు అక్రమార్కుల పై ఎలాంటి చర్యలు లేవు.. పై అధికారులకు నివేదిక సమర్పించామని కాలం వెళ్లదీస్తున్నట్లు విమర్శలున్నాయి. విచారణ జరిగి పది రోజులకు పైగా అయినప్పటికీ ఫైలు ముందుకు కదలడం లేదు.. దీంతో అనేక అనుమానాలు బాధితులకు కలుగుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
కట్టంగూరు మండలం గార్లబాయి గూడెం గ్రామానికి చెందిన వంగూరి చంద్రయ్య భూమి 6-18 ఎకరాల భూమిని ఆయన భార్య లక్ష్మమ్మకు రెవెన్యూ అధికారులు ఫౌతి చేయకుండా తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఇతరులకు చేశారు. ఇదే విషయాన్ని మార్చి 19న దిశ పత్రిక ప్రచురించింది. స్పందించిన అధికారులు మరుసటి రోజు కట్టంగూర్ రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేశారు. భూ బాధితులు.. అక్రమ పట్టా చేసుకున్న వాళ్లు.. రెవెన్యూ అధికారుల సమక్షంలోని నల్గొండ ఆర్డీవో విచారణ చేశారు. ఈ విచారణలో అధికారులు తప్పు చేశారని స్పష్టంగా అంగీకరించారు. దీంతో పాటు గతంలో కట్టంగూర్ రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అక్రమ భూ రిజిస్ట్రేషన్ బాగోతం పెద్దఎత్తున ఉందని ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు పెట్టి అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు చేశారని, వాటి పై కూడా ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 729 లో 9.14 ఎకరాల భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్ లపై కూడా మార్చి 20న దిశపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. 27న నల్గొండ ఆర్డీవో నార్కట్ పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో పూర్తిస్థాయి విచారణ చేశారు. సంబంధిత బాధ్యులను, అధికారులను కలిసి విచారణ చేశారు. ఆ విచారణలో కూడా రెవెన్యూ అధికారులే తప్పు చేశారని బహిర్గతమైంది. అంతేకాకుండా గతంలో కూడా నార్కట్పల్లి మండలంలోనే అక్రమ భూ రిజిస్ట్రేషన్ జరిగాయని, ఇందులో వాటికి సంబంధించిన బాధితులు కూడా రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని చర్చ జరుగుతుంది. కోట్ల విలువైన భూములలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన అధికారుల పై ఉన్నతాధికారులు రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.
దోషులను కాపాడేందుకు కుట్ర..
అక్రమంగా ఒకరి భూములను మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి లక్షల్లో సొమ్ము చేతులు మారిందన్న విషయం స్పష్టమైనప్పటికీ దోషులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ విభాగంలో ఉన్న ఒకరిద్దరు రెవెన్యూ అధికారులు, అదే వ్యవస్థలో పనిచేస్తు రాజకీయ పలుకుబడితో ఒకరిద్దరు రెవెన్యూ అధికారులు దోషులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అందుకోసమే విచారణ పేరుతో కాలయాపన చేస్తూ అందరూ మరిచిపోయే విధంగా ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ విభాగంలో వెలుగులోకి వచ్చిన ఒకటి, రెండు అంశాలు కాకుండా విషయాలు చాలా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటితో పాటు ఇంకా అధికారుల కనుసన్నలలో ఉండి వెలుగులోకి రాని అంశాల పై కూడా విచారణ చేయడంతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.