- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతన్నకు మాట ఇచ్చాం... నిలబెట్టుకున్నాం : ఎమ్మెల్యే

దిశ,ఎం,తుర్కపల్లి : తుర్కపల్లి మండలం కేంద్రంలో గురువారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రైతులతో రుణమాఫీ సంబరాల్లో పాల్గొని మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం గా ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమం అని అన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి సంబరాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తుర్కపల్లి చౌరస్తా నుండి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆలేరు నియోజకవర్గం రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ అమలు చేస్తుందని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో రుణమాఫీని ఏడాదికి 25వేల చొప్పున నాలుగు విడతలుగా లక్ష రూపాయలు మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరో సారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ అమలు చేయలేదన్నారు.
ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెట్టినప్పటికీ రుణమాఫీని అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, గత పాలకులు కాంగ్రెస్ అమలు చేస్తున్న రుణమాఫీ పై అవాక్కులు చెవాకులు పేల్చడం, అభాండాలు మోపే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఆగస్టు 15లోగా మిగతా లక్ష రూపాయలు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒకేసారి రూ.రెండు లక్షలు రుణమాఫీ చేయడం ఆర్థిక భారం అయినప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
తెలుపు రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ అమలు చేస్తారని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి ఇప్పటివరకు రూ.635 కోట్ల 52 లక్షలు విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఏడు నెలల కాలంలో 40 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రూ.280 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రైతు రుణమాఫీని పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దేశ్యా నాయక్, ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి ,ఏవో దుర్గేశ్వరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.