- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆయకట్టు చివరి ఎకరా వరకు నీరు అందిస్తాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

దిశ, కనగల్ : నల్లగొండలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులతో ఏఎమ్ఆర్ పీ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్, మరమ్మతు పనులను చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆయన ఎఎంఆర్పీ ఆయకట్టు పరిధిలోకి వచ్చే కనగల్ మండల కేంద్రం సమీపంలోని మైల సముద్రం చెరువు వద్ద సాగునీటి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని గ్రామాలకు సాగునీటిని ఇచ్చారని ఏఎంఆర్పీ కింద సుమారు 2 లక్షల 20,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు రెండు లక్షల 15,000 ఎకరాలకు సాగునీటిని ఇచ్చామని, అలాగే ప్రస్తుతం సాగులో ఉన్న పంట పొలాలన్నింటికీ పంటకోత వచ్చేవరకు సాగునీటిని అందిస్తామని, అందువల్ల రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాన కాలువ లైనింగ్ చేపట్టేందుకు 850 కోట్లు, మరో 350 కోట్లతో డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుకు టెండర్లు పిలవనున్నామని, లైనింగ్ కార్యక్రమం 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.
ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లో కంప చెట్లు తొలగించేందుకు తన సొంత నిధులతో 90 లక్షలు వెచ్చించి తొలగించామని తెలిపారు. రైతులు కాలువలకు గండి కొట్టడం, మోటర్లు పెట్టడం వంటివి చేయవద్దని, ఆయకట్టు చివరి వరకు సాగునీటిని అందించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని, అప్పుడే చివరి భూములకు సాగునీరు అందుతుందని అన్నారు. ఆయకట్టు చివరిలో ఉన్న భూములకు సాగునీటిని అందించడంతో పాటు, పైన ఉన్న భూములలో రైతులు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున ఉపాధి హామీ పథకం కింద ఫామ్ పాండ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. ఇందుకు ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తామని, ఫామ్ పాండ్ల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతుల బోర్లలో నీటి మట్టాలు పెరుగుతాయని అన్నారు. అలాగే వ్యక్తిగతంగా నీటి నిల్వ కట్టడాలతో పాటు, ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునే ముందుకొచ్చే వారికి ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేస్తామని, దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మైల సముద్రం చెరువు ద్వారా గత సంవత్సరం ఒక ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని, ఈ సంవత్సరం 80% సాగునీటితో నింపామని, తాగునీటితో పాటు, సాగునీటికి ఇప్పుడు ఇబ్బంది లేదని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మైల సముద్రం తూమును, నీటి సరఫరాను పరిశీలించారు. అనంతరం డి -25 కాలువను, 6 ఎల్ కాలువను పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడి కాల్వ చివరి భూముల వరకు సాగునీరు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ పంటలు ఎండిపోవడం లేదని రైతుల ద్వారా నిర్ధారించుకున్నారు. ఈ నెల 28 న సుమారు 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పునుగోడు, నర్సింగ్ బట్ల, కంచనపల్లి, బక్కసాయికుంట 4 కొత్త లిఫ్టులకు, అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయ అదనపు భవనాల నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇరిగేషన్ ఇంజనీర్లు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిపిఓ వెంకయ్య, ఇరిగేషన్, వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ, కనగల్లు మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మందడి రామచంద్రారెడ్డి, గడ్డం అనుప్ రెడ్డి, హఫీజ్, మాజీ సర్పంచ్ నర్సింగ్ కృష్ణయ్య గౌడ్, గోలి జగాల్ రెడ్డి, గోలి నర్సిరెడ్డి, వరికుప్పల రవి, తదితరులు పాల్గొన్నారు.