ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తా.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

by Sumithra |
ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తా.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

దిశ, మునుగోడు : కరువు, ప్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి కృష్ణా జలాలు అందించి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రత్తుపల్లి గ్రామ శివారులో పులిపలుపుల పెద్ద చెరువు వెళ్తున్న బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం బైక్ పై డొంక మార్గం వెంట వెళ్ళి పులిపలుపుల చెరువును పరిశీలించి మాట్లాడారు. ఈ చెర్వులోకి కృష్ణా జలాలు రావడంతో మండలంలోని రత్తిపల్లి, బీరెల్లిగూడెం, పులిపల్పుల గ్రామాల వ్యవసాయ భూములకు సాగునీరు అంది కరువు సమస్య తీరుతుందన్నారు. త్వరలో క్రిష్టాపురం గ్రామ చెరువు నుండి మునుగోడు చెరువు వరకు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలు అందించేందకు కృషి చేస్తున్నానన్నారు. చెరువు కట్ట వద్ద నుండే ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి వీలైనంత తొందరగా చెరువులు నింపేలా నీటిని పెంచాలన్నారు.

ఇప్పటికే భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి పడిపోతున్న తరుణంలో గ్రామాలలో సాగు, తాగునీటికి ఇబ్బంది కలగకుండా కృష్ణా జలాలతో చెరువులు నింపాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో తమ గ్రామాలలోని చెరువులకు కృష్ణానది జలాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేసి శాలువతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, ఉపాధ్యక్షుడు దోటి నారాయణ, జిల్లా నాయకులు వేమిరెడ్డీ జితేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మేడి నాగలక్ష్మి యాదయ్య, మాజీ సర్పంచ్లు మాధగోని రాజేష్ గౌడ్, జక్కల శ్రీనివాస్, పాలకూరి యాదయ్య గౌడ్, జాజుల సత్యనారాయణ, నడిపెల్లి యాదయ్య, పుట్ట శ్రీనివాస్ రెడ్డి,పోలగోని ప్రకాశ్, గోపగోని పాపయ్య, కంభంపాటి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed