- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వనమంతా జనం.. వన దుర్గమ్మకు నీరాజనం

దిశ, పాపన్నపేట: ఏడుపాయలకు జన గంగ పోటెత్తింది. ఎల్లలు దాటి వచ్చిన వేలాదిమంది భక్తజనంతో ఏడుపాయల క్షేత్రం జనార్ణ్యమైంది. శుక్రవారం మాఘ అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్త జనంతో వనమంతా కిక్కిరిసిపోయింది. పవిత్ర మంజీరాలో మాఘ స్నానం ఆచరించి భక్తి పారవశులయ్యారు. చెక్ డ్యాం, వనదుర్గా ప్రాజెక్టు, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీర నది పాయల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎంతో సౌకర్యంగా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి జల్లుల కింద ఉత్సాహంగా పుణ్య స్నానాలు ఆచరించి తల్లికి నీరాజనం పలికారు. అనంతరం వనదుర్గమ్మ దర్శనానికి బారులు తీరి అమ్మను దర్శించుకుని తరించారు.
వన దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల పరిసర ప్రాంతాలు మారుమోగాయి. పలువురు భక్తులు సాంప్రదాయబద్ధంగా అందంగా తీర్చిదిద్దిన గండ దీపాలు, బోనాలను డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మకు సమర్పించారు. ఆలయ అర్చకులు వేకువజాము నుంచే వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు తరలి వచ్చిన భక్త జనం తల్లికి ప్రమాణాలు అర్పిస్తూ వివిధ రకాల మొక్కలు చెల్లించుకున్నారు. సంతానం కలగని వారు ఆలయం ముందున్న సంతాన గుండంలో స్నానాలు చేసి వన దుర్గమ్మ వేడుకున్నారు. ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మంజీరాలో పుణ్య స్నానాలు ఆచరించి వన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ బాల గౌడ్, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. దుసరి విజయబాబు గౌడ్ హైదరాబాద్ వారు, అయ్యప్ప సేవా సమితి మెదక్ వారు అన్నదానం నిర్వహించారు.
భక్తులకు నిలువ నీడ, తాగునీరు కరువు
దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగం స్థలిగా ఏడుపాయల వన దుర్గ మాత క్షేత్రం కీర్తి ఎల్లలు దాటింది. రూ. కోట్లలో ఆదాయం సమకూరుతుంది. ఒకప్పుడు ఉత్సవాలకే పరిమితమైన ఆలయం.. ఇప్పుడు నిత్యం భక్తుల రద్దీతో దినదినాభివృద్ధి చెందుతుంది. రూ. కోట్లలో ఆదాయమున్న వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు, పాలకమండలి పూర్తిగా విఫలం చెందుతున్నారు. ప్రతి ఏటా మాఘ అమావాస్యకు ఏడుపాయల్లో పుణ్యస్నానమాచరించడానికి లక్షకు పైగా భక్తులు ఇతర ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సైతం భక్తులు తరలి వచ్చారు. కానీ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తులు కూర్చునేందుకు షామియానాలు, చలువ పందిళ్ళు సైతం ఏర్పాటు చేయకపోవడంతో నిలువ నీడ కరువైంది. దీంతో భక్తులు ఎండలో మగ్గిపోయారు. ముఖ్యంగా భక్తుల దాహార్తి తీర్చేందుకు త్రాగునీరు సైతం ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు దుకాణాలకు పరుగులు తీశారు. ఇదే అదునుగా దుకాణదారులు ఒక్క లీటర్ బాటిల్ పై అదనంగా రూ.10 వసూలు చేశారు.