వడ్డీ దందా కొత్త పంథా.. నగదుకు హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాల్సిందే..

by Aamani |
వడ్డీ దందా కొత్త పంథా.. నగదుకు హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాల్సిందే..
X

దిశ,నల్లగొండ బ్యూరో : పేద , మధ్య తరగతి ప్రజల అవసరాలే వారి పెట్టుబడి.. ఇదో రకం మాఫియా...అప్పులు ఇవ్వడం వ్యాపారం..అధిక వడ్డీతో ఆస్తులు కాజేయడం..అడిగితే బెదిరించడం.. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు , ఇళ్లు ఇలా ఏదైనా ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు ఇస్తారు.. సేల్ డీడీ చేసుకుంటారు. సకాలంలో తిరిగి చెల్లిస్తామని చెప్పినా వడ్డీ లెక్కలతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయమంటే చేయకపోవడం..అప్పటికే మరో వ్యక్తికి అమ్ముకోవడం చేస్తుండడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్దితి.. ఎవరికైనా చెబితే అలా ఎలా రిజిస్ట్రేషన్ చేశావు.. సేల్ డీడ్ చేయమంటేనే అమ్ముకోవడమే కదా అంటూ చెప్పడంతో పోలీసులు మొదలు రాజకీయ నేతల ఇళ్ల ముందు తమకు న్యాయం చేయాలని చెప్పులు అరిగేలా తిరిగినా ..ఏదో ఒకటి మాట్లాడుకోండని సలహా ఇస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి నుంచి వడ్డీ వ్యాపారం జోరుగా సాగేది. గ్రామాల్లో రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ.. పంట దిగుబడి రాగానే ఆ వ్యాపారులే కొనుగోలు చేసుకుని వడ్డీ లెక్కలు చేసుకుని మిగిలింది రైతులకు తిరిగి ఇచ్చేవారు. కొందరు ఫెర్టిలైజర్స్ యజమానులు నుంచి అప్పుగా ఇచ్చి పంట చేతికి రాగానే తిరిగి తీసుకునే వారు. అలా మొదలైన దందా.. పట్టణాలకు పాకింది. రోజువారీ వ్యాపారం కూరగాయల షాపులు, పాన్ షాపులు , పండ్ల వ్యాపారులు , పెట్టి వెండర్స్ కు మీటర్ కట్టింగు(రోజు వారీ వడ్డీ కమిషన్) ఇచ్చి సాయంత్రానికి వసూలు చేసుకోవడం చేసేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెట్టుబడుల కింద కోట్ల రూపాయలు ఇస్తూ ఆ వెంచర్స్ లో భూమి తమ పేర రాసుకుని ప్లాట్స్ కొనుగోలు సమయంలో తమ వడ్డీ లెక్కలు సరి చేసుకునే వారు. అలా కొన్నాళ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలతో పాటు రంగారెడ్డి , హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వడ్డీ వ్యాపారులే క్రమక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా ద్విపాత్రాభినయం చేస్తూ వస్తున్నారు.

పలు ప్రాంతాల్లో గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం కాల్ మనీ కేసులు కావడంతో అప్పటి జిల్లా ఎస్పీలు కాల్ మనీ కేసులతో పాటు , రోజూ వారీ , నెలవారీ వడ్డీ వ్యాపారులు దందా లకు చెక్ పెట్టారు. రౌడీ షీటర్లు వడ్డీ వ్యాపారులు గా మారడంతో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బాధితులకు న్యాయం చేస్తూనే వడ్డీ వ్యాపారులను కటకటాల్లోకి నెట్టారు. దీంతో కొంత కాలంగా అధిక వడ్డీ వ్యాపారుల దందా లకు చెక్ పడినట్టు అయ్యింది. కాల క్రమంలో వడ్డీ వ్యాపారులే అధికార , ప్రతిపక్ష పార్టీల నుంచి కౌన్సిలర్లుగా , మండల స్థాయి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వడంతో మళ్లీ దందా మొదలెట్టారు.

కొత్త పుంతలు తొక్కుతూ ఏకంగా రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులివ్వడం మొదలెట్టారు. అలా మొదలైన నయా దందా.. నేడు వందల కోట్ల రూపాయల వ్యవసాయ భూములు, పట్టణాల్లోని విలువైన ఇండ్లు , ఓపెన్ ప్లాట్లు చేతులు మారుతున్నాయి. ఇటీవలి కాలంలో వడ్డీ వ్యాపారుల మోసం తో ఆత్మహత్య యత్నాలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది సొంతూరులో పరువు కోసం పట్టణాలకు వలస పోతున్నారు. కొందరు పోలీసులు సైతం వడ్డీ వ్యాపారులతో కలిసి సెటిలిమెంట్లతో బాగానే సంపాదిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే సానుభూతి చూపి ఆ తర్వాత వడ్డీ వ్యాపారులు డబ్బులు ముట్టచెప్పడంతో చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో బాధితులకు న్యాయం జరగడం లేదన్న ప్రచారం లేకపోలేదు..

శాలిగౌరారాం మండలంలోని ఓ యువ రైతు తనకు తెలిసిన నకిరేకల్ కు చెందిన ఓ వడ్డీ వ్యాపారి దగ్గర రూ.24 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు కిందకి తన తండ్రి పేర ఉన్న నాలుగు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు. తిరిగి కొద్ది కొద్దిగా చెల్లిస్తానని తన నాలుగు ఎకరాల భూమిలో ఎకరం చొప్పున తిరిగి రిజిస్ట్రేషన్ చేయమంటే మొత్తం డబ్బులు తిరిగి చెల్లించాలని తిరకాసు పెట్టాడు.మూడేళ్లలో రూ. 24 లక్షల అప్పుకు అధిక వడ్డీ కలిపి కోటి రూపాయలు చెల్లిస్తేనే తిరిగి భూమి ఇస్తానంటూ ముఖం చాటేస్తున్నాడు.

హాలియా కు చెందిన ఓ యువకుడు తన వ్యాపార అభివృద్ధి కోసం వడ్డీ వ్యాపారి నుంచి రూ.50 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చే సమయంలో వడ్డీ వ్యాపారి కి హాలియాలో రెండు ఇండ్లు ,రెండు ఓపెన్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేశాడు. తిరిగి డబ్బులు చెల్లిస్తామంటే అధిక వడ్డీ లెక్క చొప్పున డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు మరొకరికి అమ్ముకునే ప్రయత్నం చేస్తుండడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

సూర్యాపేట పట్టణంలోనూ అధిక వడ్డీ వ్యాపారుల దాష్టీకాలపై అనేక మంది పోలీసు అధికారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు స్థానిక రాజకీయ నేతలను ఆశ్రయించి వడ్డీ వ్యాపారుల చెర నుంచి బయట పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారుల నయా మాఫియా పై ఉక్కు పాదం మోపాలని కోరుతున్నారు బాధితులు.



Next Story

Most Viewed