- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెచ్చిపోతున్న మట్టి మాఫియా : కనుమరుగవుతున్న కొండలు

దిశ, ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలాల్లో మట్టి మాఫియా దందా జోరుగా సాగుతున్నది. రెవెన్యూ, పోలీసు అధికారుల అండదండలతో మట్టి అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఆలేరు మండల్ కి ఆనుకుని సహజ సిద్ధంగా భారీ ఎత్తైన కొండలు, గుట్టలు ఉన్నాయి. ఆలేరు రోడ్డుకు ఇరువైపులా ప్రైవేట్ వెంచర్లు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంచర్లలో అంతర్గత రహదారుల ఏర్పాటుకు అవసరమైన ఎర్ర మట్టిని రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా తరలిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. స్థానికులు ఎవరైనా అడ్డుకునేందుకు యత్నిస్తే తాము రెవెన్యూ, పోలీసు అధికారులకు నెల నెలా మామూళ్లు అందజేస్తున్నామని బుకాయిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
ఆలేరుకి చెందిన కొందరు అధికార పార్టీ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి తరలింపునకు అనుమతులు తీసుకోకపోయినప్పటికీ, తాము అధికార పార్టీ కార్యకర్తలమన్న ధీమాతో రేయింబవళ్లు ఎక్స్కవేటర్తో భారీ టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. గొలనుకొండ గ్రామశివారులోని గుట్టలు, కొండలను పూర్తిగా తవ్వేస్తున్నారు. ఇదేమి దందా అని ఎవరైనా స్థానికులు అడ్డుకుంటే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మట్టి అక్రమ దందా కోసం ప్రత్యేకంగా ఎక్స్కవేటర్లు, భారీ టిప్పర్లు, ట్రాక్టర్లను కొనుగోలు చేసుకుని మరీ వ్యాపారం చేస్తున్నారు. కొండలు, గుట్టల నుంచి తవ్విన మట్టిని తమకు అనువైన ప్రదేశంతో పాటు, అక్కడి నుంచి అవసరమైన వారికి, ప్రైవేట్ వెంచర్లకు, ఆలేరు నియోజకవర్గ కేంద్రమైన తదితర ప్రాంతాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఒక్కో టిప్పర్కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు, ఒక్కో ట్రాక్టర్కు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు తీసుకుంటున్నారు. మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ స్థానికులు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా తమ గురించి ఎవరికి చెప్పినా భయపడేది లేదని, ప్రతినెలా రెవెన్యూ, పోలీసు ఇతర అధికారులకు మామూళ్లు ముట్టజెప్పుతున్నామని మట్టి మాఫియా నిర్వాహకులు చెప్పడం విస్మయం కలిగిస్తున్నది. ఈ విషయమై తహశీల్దార్ సంప్రదించగా ప్రతీరోజు భూముల రిజిస్ర్టేషన్లు ఇతరత్రా పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తనకు సమాచారం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ప్రకృతి ప్రసాదించిన కొండలు, గుట్టలను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
మట్టి మాఫియాను అడ్డుకోవాలి
ఆలేరు గ్రామ శివారులో మట్టి మాఫియా తరలింపును అడ్డుకోవాలి. ఆలేరు పట్టణంతో పాటు మండలంలోని పటేల్ గూడెం గొలనుకొండ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు అదేపనిగా మట్టి దందా చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. గ్రామశివారులో ఎక్కడచూసినా డంప్ చేసిన మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. అధికారులు స్పందించి మట్టి అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలి.