నష్టపోతున్న అన్నదాతలు.. కన్నెత్తి చూడని అధికారులు

by Sumithra |
నష్టపోతున్న అన్నదాతలు.. కన్నెత్తి చూడని అధికారులు
X

దిశ, నార్కట్ పల్లి : నార్కట్ పల్లికి చెందిన ఓ రైతు పదిరోజుల కింద ధాన్యాన్ని విక్రయించాడు. లారీ మిల్లుకు తరలించిన తర్వాత నిర్వాహకులు తాలువుందని ఫోన్ ద్వారా తెలిపారు. రెండు కిలోల తరుగు తీస్తున్నామని లేదంటే బీ గ్రేడ్ వేస్తామని చెప్పారు. నష్టం వస్తుందని తెలిసినా కూడా చేసేదేమీ లేక రైతు ఒప్పుకోవాల్సి పరిస్థితి. ఇంకో రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులు అవుతుంది. నేటికీ కాంటా జరగలేదు. లారీల కొరత కారణంగా కాంటాలు పెట్టడం లేదని నిర్వాహకులు తెలపడంతో పంట దగ్గరే వేచి చూస్తున్నాడు.

ఇది ఇద్దరు రైతుల పరిస్థితి కాదు జిల్లాలో చాలా మంది రైతుల ఇదే పరిస్థితి. కొనుగోలు దారులు, మిల్లర్లు కుమ్మక్కై అన్నదాతల నుంచి ధాన్యాన్ని కొల్లగొడుతున్నారు. ఒక్కో బ్యాగుకు 40 కిలోల తూకం వేయాల్సి ఉండగా తాలు పేరిట అదనంగా రెండు కిలోల వరకు సేకరిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు.

దిశ, నార్కట్ పల్లి : ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో రైతులు దగా పడుతున్నారు. కొనుగోలుదారులు, మిల్లర్లు కుమ్మక్కై అన్నదాతల నుంచి ధాన్యాన్ని కొల్లగొడుతున్నారు. జిల్లాలో ఒక్కో బ్యాగుకు 40 కిలోల తూకం వేయాల్సి ఉండగా తాలు పేరిట అదనంగా రెండు కిలోల వరకు సేకరిస్తున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. మిల్లర్లు మళ్లీ ఇక్కడ తాలు ఉందని, ధాన్యం నాణ్యత లేదని తాము మిల్లింగ్ చేయలేమని తిరస్కరించి మెలిక పెడుతున్నారు. దీంతో నిర్వాహకులు రైతులకు సమాచారం ఇచ్చి మిల్లర్లతో మాట్లాడిస్తున్నారు. తరుగు పేరిట క్వింటాకు 2 కిలోల ఒప్పందం కుదురుస్తున్నారు. చేసేదేమీ లేక రైతులు ఒప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మిల్లర్లు, నిర్వాహకులకు భాగస్వామ్యం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయినా అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ధాన్యం తరుగు విషయంలో నిబంధనలు పక్కాగా ఉన్నాయి. చెత్త తాలు 1 శాతం, మట్టి పెల్లలు, రాళ్లు 1 శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం ఉంటే 5 శాతం, పూర్తిగా తయారు కానీ, ముడుచుకు పోయిన ధాన్యం ఉంటే 3 శాతం, తక్కువ రకాల మన్నిక ఉంటే 6 శాతం వరకు మినహాయించుకోవచ్చు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా తరుగు తీస్తున్నారు. దీంతో రైతులు భారీ ఎత్తున నష్టపోతున్నారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే రైతుకు ఎంత ధాన్యం వచ్చిందో ట్రక్ షీట్ వేసి ఇవ్వాల్సి ఉంది. కానీ నిర్వాహకులు అలా వేయకుండా ధాన్యం లారీలను మిల్లుకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లు ధాన్యాన్ని చూసి తరుగు తీసిన తర్వాత మిల్లర్లు చెప్పిన ప్రకారమే నిర్వాహకులు కోత పెడుతూ రైతులకు పూర్తి ధాన్యం తూకాన్ని తెలుపుతున్నారు. ఇలా మిల్లర్లు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది జిల్లాలో.

ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు..

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు రోజుకోమారు మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొద్దంతా ఎండ కొడుతూ సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండ పోసిన ధాన్యం మళ్లీ తడిచి రావాల్సిన మాయిశ్చర్ రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలా 20 రోజుల క్రితం ధాన్యాన్ని మార్కెట్కు తీసుకు వచ్చినప్పటికీ నేటికీ కాంటాలు చేసుకోలేని పరిస్థితి రైతులది. ధాన్యం ఆరబోసేందుకు కూలీలకు అదనంగా ఖర్చులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరలింపునకు లారీలు లేవు..!

అసలే నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతులను దోచుకుంటుంటే మరోవైపు లారీలు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా నల్లగొండ జిల్లాలో లారీల కొరత కారణంగా కాంటాలు సరిగ్గా జరగటం లేదు. ఇప్పటికే అదనపు ఖర్చులు భరిస్తూ ఉన్న రైతుల పై లారీల కొరత వల్ల మరింత భారం పడనుంది. నార్కట్ పల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో గత రెండు రోజులుగా లారీల కొరత కారణంగా కాంటాలు వేయడం లేదు. నల్లగొండ జిల్లాలో 363 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 213 కేంద్రాల్లో మాత్రమే ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే నార్కట్ పల్లి, చిట్యాల మండలాల్లో ఉన్నటువంటి మిల్లర్లు సొంత మండలం నుంచి ధాన్యాన్ని కాకుండా నల్లగొండ మండలం నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని అన్లోడ్ చేసుకుంటున్నారు. దీని వెనక ఏం జరుగుతుంది అనే మతలబు ఎవరికీ అంతుచిక్కడం లేదని ప్రశ్నగా మారిపోయింది. గతంలోనూ ఈ మిల్లర్లు మిగతా మండలాల నుంచి ధాన్యాన్ని సేకరించిన సమయంలో నిర్వాహకులతో కుమ్మక్కై క్వింటాకు 5 కిలోల వరకు అదనంగా ధాన్యాన్ని తూకం వేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల పై దృష్టి సారించి రైతుల ఇబ్బందులను తొలగించాలని, వెంటనే లారీల కొరతను తీర్చి ధాన్యాన్ని కాంటాలు వేయాల్సిందిగా కోరుతున్నారు.



Next Story

Most Viewed