కడుపులోనే కన్ను మూసిన కవలలు

by Disha Web Desk 23 |
కడుపులోనే కన్ను మూసిన కవలలు
X

దిశ, యాచారం: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో నిండు గర్భిణీ తో పాటు ఐదేళ్ల బాలుడు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం ఒడ్డె పల్లి కి చెందిన పాస్టర్ అరుణ్ కుమార్ , రీతు (22) దంపతులు, మరో పాస్టర్ సుందర్, రాధిక దంపతులు వీరి సంతానం శ్యాం (5), బ్లెస్సీ (3)లతో పాటు వారి బంధువులు జంగమ్మ, ఇస్తారి జీవనోపాధి కోసం నగరంలో నివాసం ఉంటున్నారు. అరుణకుమార్ కారులో వీరంతా ఆదివారం స్వగ్రామం ఒడ్డె పల్లి చర్చి కి వెళ్లారు. సాయంత్రం నగరానికి తిరిగి వస్తుండగా మాల్ మార్కెట్ సమీపంలో వీరి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన వీరిని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో 9 నెలల గర్భిణి రీతు, బాలుడు శ్యామ్ మృతి చెందారు. రీతు గర్భంలోని కవలలు కూడా మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. గాయపడిన ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో బ్లెస్సీ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story