- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తేలిన తిరుమలగిరి సాగర్ మండల భూముల లెక్క..

దిశ, నల్లగొండ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి పేరుతో తీసుకువచ్చిన నూతన భూ చట్టం వల్ల అనేక రకాల భూ సమస్యలు తలెత్తాయి. ఎవరి భూములు ఎవరి పేరుతో నమోదయ్యాయో.. ఏ సర్వే నెంబరు ఎక్కడుందో తెలియని అయోమయ పరిస్థితి. ఈ పరిస్థితులలో మొత్తం భూముల సర్వేచేస్తే ఏ రకమైన భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి..? కబ్జాకు గురైంది ఎంత..? సాగుకు అనుకూలం ఎంత..? ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి..? నిరుపయోగంగా ఉన్న భూములను లెక్క తేల్చాలని ప్రభుత్వ భావించింది. ఈ క్రమంలోనే తిరుమలగిరి సాగర్ మండలంలోని భూములను ప్రయోగాత్మకంగా సర్వేచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అనుకున్న ప్రకారం భూముల సర్వే దాదాపు పూర్తయింది..
మండలంలో భూములు.. 21719 : 33 ఎకరాలు..
జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్న తిరుమలగిరి ( సాగర్ ) లో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 34 గ్రామపంచాయతీలు, 18 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. మండలంలో మొత్తం జనాభా 38,694 ఉంది. మండలంలో 411 గుర్తించిన సర్వే నెంబర్లలో 21719.33 ఎకరాల భూమి ఉన్నట్లు లెక్క తెల్చారు.
మొత్తం భూమి... 21719:33 ఎకరాలు
ప్రభుత్వ భూమి : 12164.08 ఎకరాలు
అటవీ భూమి : 4084.37 ఎకరాలు
రిజర్వడ్ ఫారెస్ట్ భూమి : 1296.23 ఎకరాలు
కాందీశీకుల భూమి : 2872.01 ఎకరాలు
పట్టా భూమి : 860.13 ఎకరాలు
ఫెరాడు భూమి : 55.20 ఎకరాలు
( సర్వే నెంబర్ లేని భూమి)
ఉడ్ఫా భూమి :: 347.20 ఎకరాలు
( సర్వే నెంబర్ లేని భూమి)
నేటి వరకు పూర్తైన భూ సర్వే : 20797 ఎకరాలు
మిగిలిన ఉన్న భూ సర్వే : 922.10 ఎకరాలు
సాగుకు అనుకూలంగా ఉన్న భూమి 5094.13 ఎకరాలు
సాగుకు అనుకూలంగా లేని భూమి
3931 .01 ఎకరాలు
150 మంది రెవెన్యూ సిబ్బందితో....
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తిరుమలగిరి (సాగర్) మండల భూముల లెక్కను అధికారులు తేల్చారు. చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఐదుగురు మండల తహశీల్దార్లతో కలిపి దాదాపు 150 మంది రెవెన్యూ సిబ్బంది ఈ భూ సర్వేలో పాల్గొన్నారు. ప్రతి ఊరు, మధిర గ్రామం, తండాలతో పాటు మండలంలోని ప్రతి గజం భూమి కూడా పరిగణలోకి తీసుకొని లెక్కలు తీశారు. 2024 జులై నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నాటి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచనలు పాటిస్తూ అధికారులు భూ సర్వే మొదలుపెట్టారు. సుమారు 7 నెలల పాటు భూ సర్వే కొనసాగింది. ఇక్కడ చేసిన సర్వే రాష్ట్రానికే తలమానికంగా ఉండనుంది. నారాయణరెడ్డి కలెక్టర్ బదిలీ అయిన తర్వాత అదే ప్రత్యేక శ్రద్ధతో ప్రస్తుతం కలెక్టర్ ఇలా త్రిపాఠి భూముల సర్వే పై దృష్టి సారించి భూముల లెక్కను తేల్చారు..
సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీ..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. అందులో తిరుమలగిరి సాగర్ మండలంలో దాదాపు 70 శాతానికి పైగా గిరిజనులు నివసిస్తున్నారు. అడవి బిడ్డలకు సొంత భూముల కన్నా ఎక్కువ అటవీ లేదా ప్రభుత్వ భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్లందరికీ పట్టాలు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కేసీఆర్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కానీ అమలు చేయలేదు. అయితే అక్కడ ఉన్న భూమి కంటే ఎక్కువ మొత్తంలో భూములు నట్లు పట్టా పాస్ బుక్కులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ గందరగోళానికి చెక్ పెట్టడానికి సర్వే చేపట్టారు.
ప్రస్తుతం భూముల లెక్క తేలింది . కబ్జాలో ఉన్న రైతులకు ఇక పట్టాలు పంపిణీ చేయడమే తరువాయి. అయితే ఏళ్ల తరబడి భూములు దున్నుకుంటున్న రైతులకు పర్మనెంట్ పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పట్టాలు ఇచ్చేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకురావాలని మాజీ మంత్రి జానారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు కూడా ఈ మేరకు ధ్రువీకరించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యకు పట్టాల పంపిణీతో పరిష్కారం లభించనుంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందే గిరిజనులకు భూమి పట్టాలు అందజేయాలని భావనలో ఉన్నట్లు సమాచారం.