- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నల్లగొండలో బైపాస్ నిర్మాణంతో రోడ్డున పడనున్న మూడు వేల కుటుంబాలు

దిశ, నల్లగొండ బ్యూరో: ఏళ్ల తరబడి కష్టపడి పైసా పైసా కూడా పెట్టుకుని పేదలు కొనుగోలు చేసిన ఇంటి స్థలాలు, నిర్మించుకున్న ఇల్లు మొత్తం నేలమట్టం కానున్నాయి. అభివృద్ధి పేరుతో పేదల ఆస్తులను స్వాధీన పరచుకొని వాళ్లందర్నీ రోడ్డు కోసం రోడ్డు పాలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నల్లగొండ పట్టణంలో పెద్ద వాళ్లకు చెందిన వ్యవసాయ భూములకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం పేదరికం నుంచి ఇప్పుడిప్పుడే మధ్యతరగతి కుటుంబం గా ఎదుగుతున్న వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి పేరుతో నిర్మించబోయే రింగురోడ్డు మాటున పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలను కొల్లగొడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేషనల్ హైవే 565 బైపాస్ రోడ్డు నిర్మాణానికి నకిరేకల్ టూ నాగార్జున సాగర్ సెక్షన్ లో నల్లగొండ టౌన్ బయట నుంచి బైపాస్ రోడ్డు కోసం ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఏది ఉపయోగపడుతుందో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడి నుంచి రోడ్డు వేస్తే బాగుంటుందో దాన్ని ప్రతిపాదన పంపించాలి కానీ దానికి విభిన్నంగా రోడ్ ప్రతిపాదన పంపినట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటి ఆప్షన్ వదిలి చివరి ఆప్షన్ తీసుకోవడం వెనుక చాలా పెద్ద మర్మం దాగినట్లు కనిపిస్తుంది. ఒకరికో ఇద్దరికో అన్యాయం జరిగితే ఏమైనా అనుకోవచ్చు కానీ ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు పేదవారు ఇల్లు నిర్మించుకున్న వారు వారి గృహ సముదాయాన్ని కోల్పోవడంతో వేల కుటుంబాలు ఈ బైపాస్ రోడ్డు కారణంగా రోడ్డున పడుతున్నట్లు తెలుస్తోంది.
బైపాస్ రోడ్డుకు ప్రతిపాదనలు వారీగా వివరాలు
బైపాస్ రోడ్డు నిర్మాణం కై నల్గొండ పట్టణంలో మూడు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రోడ్డు రవాణా శాఖ వారికి ప్రతిపాదనలు పంపించింది.
మొదటి ప్రతిపాదన 11 కిలోమీటర్లు నాలుగు లైన్ల రోడ్డు మొత్తం కూడా వ్యవసాయ భూముల నుండి వెళుతుంది. సుమారు 50 హెక్టార్ల భూమి దీనికి అవసరం ఉంటుంది. ఇది ఉదయ సముద్రం గేట్ల దగ్గర నుంచి అద్దంకి బైపాస్ గుండా కేశరాజు పల్లి నుండి ఎస్ఎల్బీసీ వరకు సాగర్ రోడ్డుకు లింక్ చేయబడుతుంది . ఈ రోడ్ ఏర్పాటుకు అంచనా విలువ సుమారు రూ. 690 కోట్లు ఇందులో వ్యవసాయ భూములు మాత్రమే కోల్పోతారు. ఎలాంటి నిర్మాణ కట్టడాలు లేవు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల మొదటి ప్రతిపాదనలోని 11 కిలోమీటర్ల మేర అభివృద్ధి కూడా వేగవంతమవుతుంది. భూములకు కూడా రైతులకు ఎక్కువ రేటుకు పలికే అవకాశం ఉంది. సుమారు 50 హెక్టార్ల భూమి కోల్పోవడం జరుగుతుంది.
రెండో ప్రతిపాదన 20 కిలోమీటర్లు నాలుగు లైన్ల రోడ్డు నల్గొండ పట్టణానికి కుడివైపు నుంచి పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం నుండి చర్లపల్లి బైపాస్ రోడ్డు మకతలగూడ, మామిల్లగూడెం మీదుగా ఎస్ఎల్బీసీ రోడ్డుకు లింక్ చేయబడుతుంది. రోడ్ నిర్మాణం కోసం అంచనా విలువ రూ.1000 కోట్లు. ఇందులో కూడా వ్యవసాయ భూములు సుమారు 90 హెక్టార్లు మాత్రమే కోల్పోవడం జరుగుతుంది.
మూడో ప్రతిపాదన 15.5 కిలోమీటర్స్ నల్గొండ పట్టణానికి కుడివైపు నుంచి పానగల్ నుంచి మర్రిగూడ సర్కిల్ వరకు అక్కడి నుంచి గిరికబావి గూడెం హౌసింగ్ బోర్డ్ కాలనీ మీదగా ఖతాల్గూడా నుంచి ఎస్ఎల్బీసీ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సుమారు 53 హెక్టార్లలో భూమి కోల్పోవడం జరుగుతుంది. రోడ్ అంచనా విలువ రూ. 700 కోట్లు. ఈ ప్రతిపాదనని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారని తెలుస్తుంది. ప్రజలకు నష్టం జరిగే విధంగా నలగొండ మున్సిపాలిటీ లోపలి గుండా గృహ సముదాయాలు కోల్పోయే విధంగా అపార నష్టం కలిగించే విధంగా మూడో ప్రతిపాదనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడవ ప్రతిపాదన వల్ల చాలా మధ్యతరగతి, పేద కుటుంబాల చెందిన వారి ఇళ్లు, స్థలాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది.
రూ.1500 కోట్ల ఆస్తి ధ్వంసం..
పట్టణంలో ప్రభుత్వం బైపాస్ రోడ్డు నిర్మాణంలో అడ్డంగా ఉన్న ప్రజా ఆస్తులను కూల్చడానికి రూ.524 కోట్లు వెచ్చించబోతోందని, కూల్చబోయే ఆస్తుల విలువ సుమారు రూ.1500 కోట్ల ఉంటుందని, ఇది సగటున 3000 కుటుంబాలకు రూ.50 లక్షల విలువ నష్టం జరుగుతుందని అంచనా. మర్రిగూడ బైపాస్ దగ్గర 8 షాపింగ్ షెటర్స్ రోడ్డు నిర్మాణంలో పోతున్నాయి. ఒక్క మడిగే ప్రస్తుత విలువ సుమారు రూ.80 లక్షలు ఉన్నట్టు తెలుస్తుంది. అదే ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములకు మూడు ఎకరాల భూమి ఉంది. ఒక గజం ప్రస్తుత విలువ రూ.25వేలు ఉన్నట్టు సమాచారం. అంటే మూడు ఎకరాలు ఇళ్ల స్థలాలుగా చేసి విక్రయించి నట్లయితే సుమారు రూ.7.50కోట్ల విలువ వస్తుందని ఆ రైతులు పేర్కొంటున్నారు. దేవరకొండ రోడ్డులో ఒంటరి మహిళ తన కూతురు పెళ్ళికి కట్నం కింద ఇంటి స్థలం అప్పజెప్పింది. దాని విలువ ప్రస్తుతం రూ.50లక్షలు ఉన్నట్లు వినికిడి. అంటే ఇలా ప్రతి ఒక్కరికి జీవితాంతం కష్టపడిన సంపాదించలేనంత ఆస్తి నష్టం జరుగుతుందని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కుటుంబానిది తీరని కన్నీటి వ్యధ.
కాళ్లు మొక్కుతాము కనికరించండి..
కడుపు కట్టుకొని కష్టం చేసి ఫస్ట్ నుంచి పైసా పైసా కూడా పెట్టి ఇళ్ల స్థలాలు కొనుక్కుని ఇల్లు నిర్మించుకున్నాం.. రోడ్డు నిర్మాణంలో మా ఆస్తులు అన్ని మట్టిలో కలిసిపోతున్నాయి.. మీ కాళ్లు మొక్కుతున్నాము కనికరించండి. మా ఆస్తులను రక్షించండి.. అంటూ బాధితులు మూడు రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళ మీద పడ్డారు. ఈ పరిస్థితుల్లో మంత్రి కోమటిరెడ్డి బాధితులకు ఎలా న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.