ఆఖరి మజిలీలో అనేక ఇబ్బందులు..

by Sumithra |   ( Updated:2025-01-18 04:58:02.0  )
ఆఖరి మజిలీలో అనేక ఇబ్బందులు..
X

జీవుడి ఆఖరి మజిలీలో అంతిమ సంస్కారాలకు ఇబ్బందులు తప్పడం లేదు. అంతిమ కార్యక్రమాలను సజావుగా నిర్వహించి కాటికి సాగనంపుదాం అనుకుంటే సరైన సౌకర్యాలు లేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతిమ వీడ్కోలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో దహన సంస్కారాల కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ స్థలాల్లో వైకుంఠధామాలను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక ఉండాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.12 లక్షలతో శ్మశాన వాటికలను నిర్మించింది. ఎన్నో హంగు ఆర్భాటాలతో ప్రారంభానికి పూనుకుని అడపాదడపా నిర్మించడంతో కనీస వసతులు కరువయ్యాయి. ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరా, స్నానపు గదులు, అసంపూర్తి నిర్మాణాలు వంటి ఎన్నో సమస్యలు తిష్ట వేశాయి. ఇందులో భాగంగానే వలిగొండ మండలంలోని కొన్ని గ్రామాల్లో శ్మశానవాటికల్లో కనీస సౌకర్యాలు లేక ఇప్పటికీ నిరుపయోగంగానే మిగిలి ఉన్నాయి. మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలను నిర్మించగా పూర్తిస్థాయిలో వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, వలిగొండ : జీవుని ఆఖరి మజిలీలో అంతిమ సంస్కారాలకు ఇబ్బందులు తప్పడం లేదు. అంతిమ కార్యక్రమాలను సజావుగా నిర్వహించి కాటికి సాగనంపుదాం అనుకుంటే సరైన సౌకర్యాలు లేక గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతిమ వీడ్కోలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో దహన సంస్కారాల కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ స్థలాల్లో వైకుంఠధామాలను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక ఉండాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రూ.12 లక్షలతో శ్మశాన వాటికలను నిర్మించింది. ఎన్నో హంగు ఆర్బటాలతో ప్రారంభానికి పూనుకుని అడపాదడపా నిర్మించడంతో కనీస వసతులు కరువయ్యాయి. ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరా, స్నానపు గదులు, అసంపూర్తి నిర్మాణాలు వంటి ఎన్నో సమస్యలు తిష్ట వేశాయి. ఇందులో భాగంగానే వలిగొండ మండలంలోని కొన్ని గ్రామాల్లో శ్మశానవాటికల్లో కనీస సౌకర్యాలు లేక ఇప్పటికీ నిరుపయోగంగానే మిగిలి ఉన్నాయి. మండలంలో మొత్తం 37గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలను నిర్మించగా పూర్తిస్థాయిలో వసతులు లేవు. రెడ్లరేపాక, కంచనపల్లి గ్రామాల్లో మాత్రం అసంపూర్తిగా నిర్మాణాలు చేపట్టి వదిలేశారు. నాటి నుంచి వీటిని పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. ఇలా ఉంటే వసతులు కరువవడంతో ఇప్పటివరకు ఈ దహన వాటికలను ఉపయోగించింది లేదు. చేసేది లేక కొన్ని గ్రామాల్లో ప్రైవేటు స్థలాల్లోనే అంత్యక్రియలు నిర్వహించి అనంతరం వ్యవసాయ బావులు, చెరువులు, కాలువల వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు.

శిథిలావస్థలో నిర్మాణాలు...

ఈ అసంపూర్తి నిర్మాణాలను ఇలా నిరుపయోగంగా వదిలేయడంతో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి అప్పుడే శిథిలావస్థకు చేరుకున్నాయి. రెడ్ల రేపాక గ్రామంలో స్నానపు గదుల రేకులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. డోర్లు విరిగి పోయాయి. అదేవిధంగా పర్యవేక్షణ లోపంతో పిచ్చి మొక్కలు మొలిచి చిట్టడివిని తలపిస్తోంది. కంచనపల్లి గ్రామంలో అన్నీ ఉన్నా కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో దహన వాటికలు, స్నానాల గదులు నిరుపయోగంగా మిగిలిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తి నిర్మాణాలు మాత్రం పూర్తి కావడం లేదు. దీంతో ప్రజలు వాటిని వినియోగించుకునేందుకు కూడా మొగ్గు చూపడం లేదు. తమ సొంత స్థలాలు, పట్టా భూములు, చెరువు శిఖం భూముల్లో దహన సంస్కారాలు నిర్వహించుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక ప్రభుత్వం సొమ్ము వృథా అవుతుందని పలువురు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అసంపూర్తిగా ఉన్న వాటిని అందుబాటులోకి తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.



Next Story