చిన్నారిని చితకబాదిన ఉపాధ్యాయురాలు

by Naresh |
చిన్నారిని చితకబాదిన ఉపాధ్యాయురాలు
X

దిశ, సూర్యాపేట: నర్సరీ చదివే విద్యార్థిని ఏదో కారణం చూపి ఉపాధ్యాయురాలు చితకబాదింది. దీంతో విద్యార్థికి 14 చోట్ల గాయాలయ్యాయి. ఈ ఘటన రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మంగళవారం చిన్నారి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్న అనంతరం వారు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న మధు, పార్వతి దంపతుల కుమారుడు సహస ప్రిన్సి మున్సిపల్ పరిధిలో ఆవాసం గాంధీ నగర్‌లోని లయోల పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. కాగా తెలిసి తెలియని వయస్సులో ఉన్న విద్యార్థిని ఏదో కారణం చూపి తేజస్విని అనే ఉపాధ్యాయురాలు చితక బాదినట్లు వారు ఆరోపించారు. విద్యార్థి ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ సునీల్, కరస్పాడెంట్ లూయి దాస్‌లకు తెలపగా వారు నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా ఈ విషయం పై మరో రెండు రోజుల తర్వాత మాట్లాడదాం అని చెప్పినట్లు తెలిపారు. అందుకు మా పిల్లవాడి బాధ మాకే తెలుస్తోంది మీకేమి తెలుసని తల్లిదండ్రులు ఆగ్రహంతో పాఠశాలకు వచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా ఆ ఉపాధ్యాయురాలుని వారు సమర్థిస్తు మాట్లాడుతున్నారని ఆరోపించారు.జరిగిన ఘటనపై ప్రిన్సిపాల్‌ని వివరణ కోరగా పిలవాడిని టీచర్ కొట్టిన మాట వాస్తవమేనని, అందుకు మేము తక్షణమే స్పందించి తేజస్విని అనే ఉపాధ్యాయురాలుని మందలించడమే కాకుండా పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ తల్లిదండ్రులు వినకుండా ఉపాధ్యాయురాలి పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.



Next Story