ముమ్మరంగా సాగుతున్న ప్రాజెక్టు పనులు…

by Kalyani |
ముమ్మరంగా సాగుతున్న ప్రాజెక్టు పనులు…
X

దిశ ,మర్రిగూడ: డిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కిష్టారాయన పల్లి ,శివన్న గూడెం రిజర్వాయర్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం 2015లో ప్రారంభించి 9 ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అధికారులతో కాంట్రాక్టులతో వరుస సమీక్షలు చేస్తున్నాడు. ఇప్పటికే 68 శాతం వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. భూ నిర్వాసితులకు దక్కాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ప్లాట్లు పై వరుస సమీక్షలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే అధికారులను కాంట్రాక్టర్లను పరుగులు పెట్టిస్తూ పనులను ముమ్మరం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా చేస్తున్న ఒత్తిడి మేరకు తొమ్మిది సంవత్సరాలు జరగని పనులు ఆరు నెలల్లో వేగం పుంజుకోవడంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న మండలాల ప్రజలు ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వేగవంతంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులు...

శివన్నగూడ గ్రామ పరిధిలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఐదు రిజర్వాయర్ ప్రాజెక్టు పనులకు 2015 లో శంకుస్థాపన చేశాడు. ప్రాజెక్టు సమయంలో ఆరు నెలల్లో కుర్చీ వేసుకుని ప్రాజెక్టు పనులను ముమ్మరం చేసి రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తానని, భూ నిర్వాసితులకు 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం అర్హులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి కడుపులో పెట్టి చూసుకుంటానని హామీ ఇచ్చాడు. 9 సంవత్సరాలైనా ముందుకు సాగని ప్రాజెక్టు పనులు బై ఎలక్షన్ లో ఓట్ల కోసం మునుగోడు సీటు కోసం మాత్రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు భూనిర్వాసితులకు 90 శాతం మేర అందింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా రోడ్డున పడ్డామని భూనిర్వాసితులు బీఆర్ఎస్ పార్టీకి గోరి కట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రాజెక్టు పనులపై దృష్టి సారించి పనులను వేగవంతం చేసింది.

ప్రాజెక్టు కాంట్రాక్టర్ ప్రభుత్వంలో కీలక మంత్రి...

శివన్న గూడెం ప్రాజెక్టు కాంట్రాక్టర్ రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతనే ప్రభుత్వంలో కీలక మంత్రి కావడంతో ప్రాజెక్టు పనులు ఆగ మేఘంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో కేసీఆర్ నిధులు విడుదల చేయక ఆ పార్టీ నేతల బెదిరింపులకు ఎలక్షన్ ముందు సంవత్సరం వరకు ప్రాజెక్టు పనులను నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వంలో కాంట్రాక్టర్ కీలక మంత్రి కావడంతో ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రాజెక్టు పనులు 9 సంవత్సరాలు జరిగినటువంటి పనులు ఆరు నెలల్లో జరగడంతో రాబోయే రెండు సంవత్సరాలలో ప్రాజెక్టు పనులు పూర్తికానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలు ప్రాజెక్టు పనులపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

18 టీఎంసీలతో మునుగోడు సస్యశ్యామలం...

మునుగోడు నియోజకవర్గంలో చేపడుతున్న శివన్న గూడెం ప్రాజెక్టు 12 టీఎంసీలు, కిష్టారాయణ పల్లి ప్రాజెక్టు సుమారు 6 టీఎంసీల నిర్మాణం సామర్థ్యంతో జరుగుతున్న పనులు సుమారు 68 శాతం పూర్తి అయ్యాయి. రెండు ప్రాజెక్టు పనులు పూర్తి అయి రిజర్వాయర్లు 18 టీఎంసీల నీటితో నిండితే నియోజకవర్గంలోని 3500 ఎకరాలు సాగునీటితో సస్యశ్యామలం కానున్నాయి. నియోజకవర్గాల చిరకాల వాంఛ అయిన ఫ్లోరైడ్ సమస్యను పారదోలి కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేయాలని కలలు కన్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కళ త్వరలో నెరవేర నున్నది.

వరుస సమీక్షలతో వేగం పెంచిన ఎమ్మెల్యే...

మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో చేపడుతున్న శివన్నగూడ కిష్టారాయన పల్లి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస సమీక్షలు చేస్తూ పనుల వేగవంతం పెంచారు. ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన ఇండ్లు కోల్పోయిన అర్హులందరికీ అండగా ఉంటానంటూ ప్రభుత్వంపై వారికి రావలసిన బెనిఫిట్స్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తనకు పూర్తిస్థాయిలో డేటా కావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఏది ఏమైనా 9 సంవత్సరాల వరకు పనులలో వేగవంతం లేక ప్రాజెక్టు పనులు నత్త నడకన, భూ నిర్వాసితులకు సరైన ఉపాధి లేక ఆగమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చూపుతున్న చోరువ తో భూ నిర్వాసితులలో ఆశలు చిగురిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే భూ నిర్వాసితులకు అండగా ఉంటానంటూ ప్రస్తుతం రేట్ల ప్రకారమే భూనిర్వాసితులకు దక్కాల్సిన బెనిఫిట్స్ తమకు అందజేయాలని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో భూ నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed