- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రామాల్లో మొదలు కానున్న ఎన్నికల సందడి ?

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : మొన్నటి వరకు ఊర్లల్లో అసెంబ్లీ, లోక్సభ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడిలో మునిగితేలిన నాయకులకు.. ఇక పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసిపోగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే పల్లెలు కాలం వెల్లదీస్తున్నాయి.
సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వార్తలు గుప్పుమనడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించిందన్న వార్తలు ఊర్లల్లో కోడై కూస్తున్నాయి. ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు గ్రామ పంచాయతీల వారిగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించిందని, ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీ వార్డుల వారిగా విభజించి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 23 మండలాలు ఉన్నాయి. మూడు రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి. సుమారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 9,34,402 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 4,62,644, మహిళలు 4,71,729, ఇతరులు 29 మంది ఉన్నారని సమాచారం.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 475 గ్రామపంచాయతీలు, 4322 వార్డులు ఉండగా.. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో సర్పంచులుగా కావాలనే ఆశతో ఉన్న వివిధ పార్టీల నాయకులు తమ పంచాయతీ, వార్డుల్లో ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు రిజర్వేషన్ల విషయంలో తీవ్రఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ,లోక్సభ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్న నాయకులు ఇకనుంచి పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కాక తప్పడం లేదు. ఎన్నికల సమయం రోజు రోజుకూ దగ్గర పడుతుండడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అంతే కాకుండా గ్రామపంచాయతీలలో ఎక్కువశాతం బీఆర్ఎస్ ప్రజాప్రతినిదులు ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరేందకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అంతే కాకుండా ఊర్లల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే యువతను మచ్చిక చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం ఓటుకు రూ.5 నుంచి 10 వేలు కూడా ఖర్చు చేయడానికి నేతలు తగిన వనరులను సమకూర్చుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధిక గ్రామపంచాయతీలో గెలిపించుకోవడానికి ఇప్పటినుంచి కసరత్తు మొదలుపెట్టారు. అదేవిధంగా అన్ని విధాలా బలమైన నాయకులను బరిలో నిలపడానికి వేట మొదలు పెట్టగా, గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి అత్యధిక గ్రామపంచాయతీ లను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆయా గ్రామాల్లో పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. దానికోసం నాయకులు, కార్యకర్తలు చేజారి పోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన నాయకులే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ రోజు రోజుకు పుంజుకుంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాకపోవడం వలన ఎవరు ఎక్కువ స్థానాలు గెలుసుకుంటారో వేచి చూడాలి.