శిథిలావస్థలో ఉన్న వైద్యశాలను వేరే ప్రాంతానికి తరలించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాటి

by Sumithra |
శిథిలావస్థలో ఉన్న వైద్యశాలను వేరే ప్రాంతానికి తరలించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాటి
X

దిశ, చండూరు : ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను, మాత, శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచుతూ, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను పెంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి వైద్యాధికారిణి ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న చండూరు ఆరోగ్య కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేసి దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు, గదులు, హాస్పిటల్ లో ఉన్న ల్యాబ్ ను, ఓపీ రిజిస్టర్ ను పరిశీలించి, ప్రతి రోజు ఎంతమంది పేషెంట్లు ఆస్పత్రికి వస్తున్నారని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా ఏఏ పేషెంట్లు వస్తున్నారని కలెక్టర్ అడగగా, జలుబు, దగ్గు వచ్చిన వారు వస్తున్నారని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు.

మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని ఆరా తీశారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 2023 సంవత్సరం కన్నా ముందు ఉన్న మందులను రోగులకు ఇవ్వవద్దు అని సూచించారు. ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేనందున ఎన్నికల కోడ్ ముగియగానే సిబ్బంది నియామకం చెపడతామన్నారు. హాస్పిటల్ శిథిలావస్థలో ఉన్న గోడలను పరిశీలించారు. అనంతరం బాలికల వసతి గృహానికి వెళ్లి తనిఖీ చేశారు. అదేవిధంగా బోడంగ్ పర్తిలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసి హాస్టల్ ను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ ఇష్టంతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆమె వెంట ఆర్డీఓ శ్రీదేవి , తహశీల్దార్ దశరథ, జిల్లా సహాయ వైద్యాధికారి కళ్యాణ చక్రవర్తి, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed