తొలితరం కవి రావిరాల మృతి..

by Sumithra |
తొలితరం కవి రావిరాల మృతి..
X

దిశ, చిట్యాల : చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన తొలి తరం కవి రావిరాల బుచ్చయ్య అనారోగ్య కారణంతో శనివారం హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఆదివారం ప్రముఖ కవులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. రావిరాల బుచ్చయ్య 1977 లోనే విముక్తి పతంలో అనే గ్రంథం రాసి పలువురి ప్రశంసలు పొందారని, అంతకు ముందు 1964లో చిందు రామవ్వ అనే నవల ద్వారా కవితాలోకాన్ని అలరించారని, నాటి నుండి కథలు, నాటకాలు రాయడమే కాకుండా టీవీ ఆర్టిస్టుగా, నాటక కర్తగా ప్రసిద్ధి పొందాడు. వట్టిమర్తి గ్రామంలో ప్రజా చైతన్య బీజాలు నాటిన తొలితరం రచయితల్లో రావిరాల బుచ్చయ్య ప్రముఖులని గ్రామానికి చెందిన ఆదర్శ రైతు ఎద్దుల అంజిరెడ్డి తెలిపారు.

సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ సభకు హాజరైన అతి కొద్ది మంది సభ్యుల్లో రావిరాల బుచ్చయ్య కూడా ఒకరని అన్నారు. కొంతకాలం నల్గొండ జిల్లా విరసం అధ్యక్షులుగా పనిచేసిన రావిరాల కడదాకా అనే నిబద్ధతతో కవిత్వం రాశారని కొనియాడారు. తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ మాట్లాడుతూ రావిరాల బుచ్చయ్య మరణం అభ్యుదయ సాహిత్యానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సృజన సాహితీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, దర్శనం అంజయ్య, మేరేడి యాదగిరి రెడ్డి, వట్టిమర్తి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నర్రా లవేందర్ రెడ్డి, బురుగు రమేష్, తదితరులు సంతాపం తెలియజేశారు.



Next Story