- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వేలల్లో దరఖాస్తుదారులు.. కొద్దిమందితోనే జాబితా ఏర్పాటు...

దిశ, సంస్థాన్ నారాయణపురం : గత పదేళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయక గత ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల జారీకి ప్రక్రియ మొదలు పెట్టడంతో సామాన్యులు ఊరట చెందారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో రేషన్ కార్డుదారుల దరఖాస్తులకు ప్రామాణికత ఏంటో తెలియక అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరుకు విధివిధానాలను విడుదల చేసిన నూతన దరఖాస్తులకు ఏ విధానాలను ప్రామాణికత చేసుకున్నారో తెలియక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో కొద్దిమంది దరఖాస్తుదారుల జాబితాతో సర్వే కార్యక్రమం మొదలైంది. అసలు ఈ జాబితా కులగణన సర్వే ఆధారంగా చేశారా ? లేదా ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగా చేశారా? అనేది అధికారులకు కూడా అవగాహన లేకుండా పోయింది. వేలలో దరఖాస్తులు చేసుకుంటే కొద్ది మందితో మాత్రమే జాబితాలు రావడంతో అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
అర్హులకు తప్పని తిప్పలు..
నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న లబ్ధిదారులకు నిరాశ తప్పడం లేదు. నిజమైన అర్హుల పేర్లు జాబితాలో రాకపోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన దరఖాస్తుదారుల జాబితాలో పలువురు ప్రభుత్వ రంగ సంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేసిన వారి పేర్లు కూడా ఉండడం కొంత విస్మయానికి గురిచేస్తుంది. అన్ని అర్హతలు ఉండి ప్రజా పాలనలో కుల గణనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నిజమైన అర్హుల పేర్లు రాకపోవడంతో వారు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సర్వే చేస్తున్న అధికారులు ఇది తొలి జాబితా అని చెబుతున్నప్పటికీ ప్రజలు వారి మాటలను విశ్వసించడం లేదు. గత ప్రభుత్వంలో ఇలాగే మొదటి విడత అని చెప్పి ఉప ఎన్నికల సమయంలో కొందరికి రేషన్ కార్డును మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం పై కూడా అదే అపనమ్మకంతో ఉన్నారు.
నూతన దరఖాస్తులకు అవకాశం లేదా ?
ప్రస్తుతం కొద్ది మందితో మాత్రమే దరఖాస్తుదారుల జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం జాబితాలో పేరు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందా ? లేదా అనే అనుమానం కలుగుతుంది. అర్హుల ఎంపిక కోసం సర్వే చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుదారుల లిస్టును వాళ్లే ఫైనల్ చేయడం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దరఖాస్తుదారుల లిస్టును కుదించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్లో అర్హులను ఎంపిక చేస్తున్నప్పుడు దరఖాస్తుదారులను ఎందుకు కుదించారో అర్థం కావడం లేదని సామాన్యులు వాపోతున్నారు.
ఇకనైనా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫీల్డ్ వెరిఫికేషన్లో అర్హులను ఎంపిక చేయాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ కార్డు దరఖాస్తుదారుల జాబితాను బహిర్గతం చేసేందుకు అధికారులు ఇష్టపడకపోవడం పై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కేవలం 183 మంది దరఖాస్తు దారులతో మాత్రమే జాబితా రావడంతో అర్హులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుదారుల జాబితాలో పేర్లు లేని వారు అధికారులను మా పేరు ఎందుకు లేదంటూ ప్రశ్నిస్తుండడంతో గందరగోళం ఏర్పడకుండా ఇది తొలి జాబితా మాత్రమేనని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీని పై ప్రభుత్వ పెద్దలు స్పందించి ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం చేయాలని వేడుకుంటున్నారు.
పదేళ్లుగా రేషన్ కార్డు లేదు.. చిలువేరు స్వాతి, గృహిణి, సంస్థాన్ నారాయణపురం
2015లో తన వివాహం అయ్యిందని, తనకు ఒక బాబు పుట్టాక నూతన రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నానని చెబుతున్నారు గృహిణి చిలువేరు స్వాతి. గత ప్రభుత్వంలో తనకు రేషన్ కార్డు మంజూరు చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రేషన్ కార్డు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నపటికీ రేషన్ కార్డు సర్వే దరఖాస్తుదారుల జాబితాలో తన పేరు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తనకు ఇద్దరు పిల్లలు. తనకు ఒక ఎకరం భూమి మాత్రమే ఉందని, తాను తన తల్లి గారి ఇంటి వద్ద ఉందన్నారు.
జాబితాలో నా పేరు లేదు.. ఉష్కాగుల జ్యోతి, గృహిణి, సంస్థాన్ నారాయణపురం
తనకు రెండేళ్ల కింద వివాహం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కడ రేషన్ కార్డులో తన పేరు లేదంటున్నారు గృహిణి ఉష్కాగుల జ్యోతి. నూతన రేషన్ కార్డు కోసం ప్రజా పాలనలో కూడా దరఖాస్తు చేసుకున్నానన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రేషన్ కార్డు వస్తుందని ఆశించినా దరఖాస్తుదారుల జాబితాలో తన పేరు లేకపోవడం ఆందోళనకు గురి చేసిందన్నారు. నూతన దరఖాస్తు చేసుకునేందుకు కూడా ప్రస్తుతం అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. తనకు రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందో అధికారులే తెలపాలన్నారు. తనకు వ్యవసాయ భూమి, సొంత ఇల్లు ఏమి లేవన్నారు.