ఆ వ్యాపారులకు రాచకొండ సీపీ సీరియస్ వార్నింగ్

by Naveena |   ( Updated:2025-02-18 14:50:23.0  )
ఆ వ్యాపారులకు రాచకొండ సీపీ సీరియస్ వార్నింగ్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు హెచ్చరించారు. మంగళవారం భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర, యాదాద్రి ఇన్చార్జీ ఏసీపీ కే.రాహుల్ రెడ్డిలతో‌ కలిసి ఆలేరు పెద్దవాగును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 50,000 టన్నుల మట్టిని సీజ్ చేసి, అక్రమార్కులపై పలు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి, పర్యావరణ పరిరక్షణకు, చట్టానికి కట్టుబడి ఉండటానికి రాచకొండ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్ రావు, ఆలేరు ఎస్ఐ రజినీకర్ లు ఉన్నారు.అక్కడ నుంచి సీపీ సుధీర్ బాబు బీబీనగర్ మండలంలో పర్యటించారు.‌ పడమటిసోమారం గ్రామంలో లింగ బసవేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడారు.



Next Story

Most Viewed