- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వన మహోత్సవం, ప్రజాపాలన సహాయ కేంద్రాల నిర్వహణ, మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, వానాకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలలో ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఉద్యోగుల సాధారణ బదిలీలు వంటి పలు అంశాలను సీఎస్ సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. వన మహోత్సవం కార్యక్రమం క్రింద నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. జిల్లాలలో పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ పార్క్ లలో మొక్కల పెంపకం పై ప్రత్యేక దృష్టి సారించాలని, గతంలో నాటిన మొక్కలలో చనిపోయిన మొక్కలను రిప్లేస్ చేయాలని అన్నారు. ఇంటింటికి పంపిణీ చేసే మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయు నూతన మీ సేవా కేంద్రాల్లో వీలైనంత మేర మహిళా సంఘాల సభ్యులచే ఏర్పాటు చేయాలని, ఆసక్తి, అర్హత గల మహిళల గుర్తింపు, వారి శిక్షణ, బ్యాంక్ లింకేజ్ రుణాలు వంటి అంశాలను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సీఎస్ అన్నారు.
జిల్లాలో ప్రముఖమైన ప్రదేశాలలో మహిళా సంఘాలచే అమ్మ క్యాంటీన్ లను ఏర్పాటు చేయాలని, మహిళా శక్తి క్రింద ఇతర వినూత్న కార్యక్రమాలను అమలు చేసేందుకు సలహాలు, సూచనలు ఉంటే ప్రభుత్వానికి అందజేయాలని సీఎస్ తెలిపారు. స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని, ఆ రుణాలతో మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి చివరి దశ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సీఎస్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి రెండవ జత ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను పంపిణీ పూర్తి చేయాలని అన్నారు.
వానాకాలం ప్రారంభమై వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటల సాగు పెరుగుతుందని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. విత్తనాల లభ్యత అంశాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని అన్నారు. రైతు భరోసా వర్క్ షాప్ లను పకడ్బందీగా నిర్వహించా లని అన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసుల వ్యాప్తి అరికట్టాలని, స్థానిక సంస్థల అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామాలు, పట్టణాలలో రెగ్యులర్ గా ఫాగింగ్ నిర్వహించాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని అన్నారు.
పెండింగ్ ధరణి దరఖాస్తులను ప్రత్యేక శ్రద్దతో పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జిల్లా స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రిటైల్ మార్కెట్ నందు స్టాకు వివరాలు గోడౌన్ లో ఉన్న స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు పరివేక్షిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగుల బదిలీకి సంబంధించి 4 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల జాబితా, ప్రస్తుతం ఉన్న ఖాళీల జాబితా శాఖల వారిగా ప్రదర్శించామని, 12 వరకు బదిలీల దరఖాస్తులను స్వీకరించి పారదర్శకంగా బదిలీల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. వన మహోత్సవం లో భాగంగా ఇప్పటివరకు 10,63,393 మొక్కలు నాటడం జరిగిందని, శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా శక్తి ద్వారా మైక్రో ఎంటర్ప్రైజెస్ పై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, మహిళా సంఘాలు అందించే రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను వారం రోజులలో పూర్తి చేయాలని, పూర్తి చేసిన పనులకు ఎంపిలు త్వరగా ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పనులను ఎంపీఓ, ఎంపీడీవో పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. అన్ని పాఠశాలలో దోమల నిర్మూలన కొరకు ఫాగింగ్ చేయించాలని దీనిపై డి ఎం హెచ్ ఓ నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు.
సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున జ్వరాలు వచ్చే ప్రాంతాలలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆ ప్రాంతాలను ఫాగింగ్ చేయాలని అలాగే అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు నిలువ లేకుండా చూడాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ప్రతి రోజు నివేదిక పెట్టాలని వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డికి కలెక్టర్ తెలిపారు. హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలందరికీ స్క్రీనింగ్ నిర్వహించాలని అలాగే సిబ్బందికి కూడా స్క్రీనింగ్ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీష్ కుమార్, జడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, ఆర్డీఓ మధుసూదన్ రాజు డీపీఓ సురేష్ కుమార్, డీఈఓ అశోక్, పంచాయతీరాజ్ ఇరిగేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.