- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆరు గ్యారెంటీలు కాదు...పేద బిడ్డల ప్రాణాలకు గ్యారెంటీ కావాలి

దిశ, సూర్యాపేట : కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలు ముఖ్యం కాదని, ఇప్పుడు పేద బిడ్డల ప్రాణాలకు గ్యారెంటీలు కావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలు,వసతి గృహాల్లో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సూర్యాపేట మండలంలోని జిల్లా ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించి, న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయింంచారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ రాష్ట్ర క్యాబినెట్ లో ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ సంక్షేమ మంత్రులు లేకపోవడం శోచనీయమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై అధికార,ప్రతిపక్ష నాయకులు చర్చించక పోవడం దురదృష్టకరం అన్నారు. విద్యార్థినిల ఆత్మహత్యలపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
అలాగే వైష్ణవి మృతి చెందటం బాధాకరం అని, విద్యార్థుల మరణాలపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రముఖ న్యాయవాది, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తళ్లమళ్ల హసేన్ డిమాండ్ చేశారు. వైష్ణవిని హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, అందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కారకులను కఠినంగా శిక్షించాలి
గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన దగ్గుబాటి వైష్ణవి అనుమానాస్పద మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ గురుకుల కళాశాల ముందు కేవీపీఎస్ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. వీరితో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొని వైష్ణవి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.