గందరగోళంగా మారిన ఇసుక అలాట్మెంట్

by Mahesh |
గందరగోళంగా మారిన ఇసుక అలాట్మెంట్
X

దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో వినియోగదారులకు ఇసుక అందించడం కోసం ప్రభుత్వం వేములపల్లి మండలం రావులపెంట, మాడుగులపల్లి మండలం బొమ్మకల్ గ్రామాలలో నిర్వహిస్తున్న ఆన్లైన్ మన ఇసుక వాహనం గందరగోళంగా మారింది. అలాట్మెంట్లు ఇవ్వడంలో ఆన్లైన్ విధానం సక్రమంగా లేదు. దీంతో పాత అలాట్మెంట్లకు ఇసుక పంపిస్తుండడంతో ట్రాక్టర్ యజమాన్యులు గిట్టుబాటు కావడం లేదని పేర్కొంటున్నారు. దీంతో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు సకాలంలో ఇసుక రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి ఇసుక రాకపోవడంతో ఇటు వినియోగదారులు, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ట్రాక్టర్ ల యాజమాన్యం మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఆన్లైన్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గిట్టుబాటు కావడం లేదంటున్న యాజమాన్యం

ప్రభుత్వం సరఫరా చేస్తున్న మన ఇసుక వాహనం ద్వారా ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్ యాజమాన్యాలకు ప్రభుత్వం అందించే రేటు గిట్టుబాటు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. 2018 లో మన ఇసుక వాహనం ప్రారంభించే సమయంలో కిలోమీటర్ కు 65 రూపాయల చొప్పున ట్రాక్టర్ యాజమాన్యానికి చెల్లించేవారు. ప్రస్తుతం పెరిగిన డీజిల్ రేటు, లేబర్, డ్రైవర్ రేట్లకు అనుగుణంగా ధర చెల్లించాలని ట్రాక్టర్ యాజమాన్యం డిమాండ్ చేస్తున్నారు.

పాత వాటికి అలాట్మెంట్లు

ట్రాక్టర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ట్రిప్ కు 425 రూపాయలు చొప్పున పెంచినప్పటికీ పాత అలాట్మెంట్ ఇస్తుండడంతో యాజమాన్యం ఇసుక సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నారు. అధికారులు అలాట్మెంట్ చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతనంగా ఇసుక బుక్ చేసుకున్న వారికి మాత్రమే అలాట్మెంట్ ఇవ్వాల్సింది పోయి పాత వాటికి ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ట్రాక్టర్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు గ్రామ పంచాయతీలను ఆన్లైన్ లో తప్పుగా చూపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉదాహరణకు శ్రీనివాస్ నగర్ బుక్ చేసుకునే వారికి మిర్యాలగూడ అడ్రస్ తోనే బుక్ చేస్తున్నారు దీంతో మరో ఏడు కిలోమీటర్ల దూరం ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుందని ట్రాక్టర్ యాజమాన్యం నిరాకరించడంతో అక్కడ బుక్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులు ఆన్లైన్ లో ప్రతి గ్రామంతో పాటు పట్టణంలోని ప్రతి వీధిని తప్పనిసరిగా సూచించే విధంగా మార్పులు చేయాలని వినియోగదారులు, ట్రాక్టర్ యాజమాన్యాలు కోరుతున్నారు.

సర్దుకొని లేబర్ సమస్య

మండలంలోని రావులపెంట పాలేరు వాగు నుంచి నిర్వహిస్తున్న ఇసుక రీచ్ లో లేబర్ సమస్య రోజురోజుకు పెరుగుతుంది. అధికారులు లేబర్ ను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేబర్‌కు చెల్లించాల్సిన ధర తో పాటు విధివిధానాలు అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆన్లైన్ సమస్యతో పాటు లేబర్ సమస్యను పరిష్కరించి సకాలంలో ఇసుకను అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.



Next Story