బేగంపేట వాసులకు వాగు పరేషాన్..

by Sumithra |
బేగంపేట వాసులకు వాగు పరేషాన్..
X

దిశ, రాజపేట : మండలంలోని బేగంపేట గ్రామ ప్రజలకు వాగు పరేషాన్ పట్టుకున్నది. వాగు మీద హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండగా పక్క నుంచి దారి తీశారు. నామమాత్రంగా పైపులు వేసి మట్టి పోశారు. అయితే ఇటీవల గంధమల చెరువులోకి నీరు భారీగా వచ్చి అది నిండుకొని వాగు ద్వారా చెరువులు నింపేందుకు వదులుతున్నారు. ఆ నీటి తాకిడికి పోసిన మట్టి పైపులు కొట్టుకుపోయాయి. దీంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గంధమల్ల మీది నుంచి రాజపేటకు అదనంగా పది కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు.

కల్వర్టు నిర్మించి పనులు చేపట్టాలి..

బ్రిడ్జి నిర్మాణం చేసే ముందు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పక్కన కల్వర్టు నిర్మించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలి. కానీ కాంట్రాక్టర్ అలా చేయకుండా నామమాత్రంగా పైపులు వేసి పనులు మొదలు పెట్టాడని, ఆ పనుల్లో నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు నెలలు పనులు కొనసాగుతాయని ఉన్నతాధికారులు పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకొని సమస్య పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇప్పటికే నాలుగు సార్లు కొట్టుకుపోయింది...

హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినప్పటి నుండి నాలుగు సార్లు నీళ్లు వదలడంతో వేసిన పైపులు కొట్టుకుపోయాయని గ్రామస్తులు తెలిపారు. నీళ్లు తగ్గితేనే మళ్లీ పైపులు వేస్తా అని కాంట్రాక్టర్ అంటున్నారని, సంక్రాంతి పండుగకు ముందు ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని రాకపోకలకు ఇబ్బందులు లేకుండా వెంటనే పైపులు వేయాలని ప్రజలు కోరుతున్నారు. నీళ్లు వదిలే అధికారులు బ్రిడ్జి నిర్మాణం చేసే అధికారులకు సమన్వయ లోపంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.



Next Story

Most Viewed