ఉదయ సముద్రం రిజర్వాయర్ లోకి నీటి విడుదల

by Sridhar Babu |
ఉదయ సముద్రం రిజర్వాయర్ లోకి నీటి విడుదల
X

దిశ, నార్కట్ పల్లి : బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం రిజర్వాయర్ లోకి బుధవారం ఒక మోటార్ ద్వారా నీటిని విడుదల చేశారు. గత నెలలో అధిక వర్షాల వల్ల నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో గేట్లు ఎత్తిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో నల్లగొండ పట్టణంలోని పానగల్ ఉదయ సముద్రంలో నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అధిక నీరు అందుబాటులో ఉండడంతో నీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. నీటి విడుదల విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. కోమటిరెడ్డి కలల ప్రాజెక్టుగా

చెప్పుకునే ఉదయ సముద్రం ప్రాజెక్టు కల పూర్తయిందని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రిజర్వాయర్ ను నింపుతారని పార్టీ కార్యకర్తలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాల నుంచి వచ్చిన వెంటనే 20వ తేదీ లోగా ఈ ప్రాజెక్టును సందర్శించి రిజర్వాయర్ నింపే విషయం, అదే విధంగా కాలువల ద్వారా మొదటి ఆయకట్టుకు నీటిని పంపించే విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. ఏదేమైనప్పటికీ 17 ఏళ్లుగా ఆగుతూ సాగుతూ ఉన్న ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వంలో సైతం మోటార్ ద్వారా రిజర్వాయర్ లోకి నీటిని అందించిన విషయం అందరికీ తెలిసిందే. అదే తరహాలో ప్రస్తుతం నీటిని రిజర్వాయర్ లోకి పంపిస్తున్నారు. మంత్రి వెంకటరెడ్డి అదే కృషితో మొదటి ఆయకట్టులో ఉన్నటువంటి చెరువుల్లోకి నీటిని పంపించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.



Next Story